రవిశాస్త్రి మాట్లాడుతూ
దీంతో మ్యాచ్ ఆడటంపై ఇప్పటి వరకూ స్పష్టమైన నిర్ణయం తీసుకోని బీసీసీఐ.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఓ జాతీయా ఛానెల్కి ఇచ్చిన ఇంటర్యూలో రవిశాస్త్రి మాట్లాడుతూ "ఈ విషయంపై ఏం జరుగుతుందనేది మాకంటే బీసీసీఐ, ప్రభుత్వానికే ఎక్కువగా తెలుసు. దీనిపై తుది నిర్ణయం వాళ్లే తీసుకుంటారు" అని అన్నాడు.
వాళ్ల నిర్ణయం ప్రకారమే మేం నడుచుకోవాలి
"ఈ అంశంలో మేం చేసేదేమీ లేదు. వాళ్ల నిర్ణయం ప్రకారమే మేం నడుచుకోవాలి. ఒకవేళ ఈ అంశం సున్నితమైంది. మీరు ప్రపంచకప్ ఆడొద్దని మా ప్రభుత్వం చెబితే మొత్తం టోర్నీనే రద్దు చేసుకుంటాం" అని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. వరల్డ్కప్లో భాగంగా జూన్ 16న భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు 2012-13 నుంచి ద్వైపాక్షిక సిరీస్లు ఆడటం లేదు.
పుల్వామా దాడి నేపథ్యంలో
కేవలం ఐసీసీ, ఆసియా కప్ లాంటి మెగా టోర్నీల్లో మాత్రమే తలపడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు పుల్వామా దాడి నేపథ్యంలో ఐసీసీకి బీసీసీఐ ఓ లేఖ రాసింది. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో ఆటగాళ్లు, అధికారులు, అభిమానుల భద్రత విషయంపై తాము ఆందోళన చెందుతామని అందులో పేర్కొంది. ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న దేశాలతో క్రికెట్ మ్యాచ్ జరుగకుండా చూడాలని కోరింది.
పాక్తో మ్యాచ్పై ఐసీసీకి బీసీసీఐ లేఖ
అలాంటి దేశాలను ఐసీసీ నుంచి తొలగించాలని డిమాండ్ కూడా చేసింది. భారత్ జట్టు ఒకవేళ పాక్తో మ్యాచ్ను బహిష్కరిస్తే? అప్పుడు పాకిస్థాన్ను విజేతగా ప్రకటించి రెండు పాయింట్లు కేటాయిస్తారు. అదే జరిగితే ఇప్పటి వరకూ ప్రపంచకప్లో భారత్పై ఒక్కసారి కూడా గెలుపొందని పాకిస్థాన్ను చేజేతులా మనమే తొలిసారి గెలిపించినట్లవుతుందని దిగ్గజ క్రికెటర్లు సచిన్, గవాస్కర్లు అన్నారు. అలాకాకుండా పాక్ను ఓడించాలని వారిద్దరూ సూచించారు.