ధోని.. ధోని అన్నోళ్లే..
అతని అద్భుత ప్రదర్శ ప్రభావం ఎంతలా ఉందంటే.. మొన్నటి వరకు ధోని, ధోని అంటూ నినాదాలు చేసిన అభిమానులంతా రాహుల్.. రాహుల్.. రాహులే ఫ్యూచర్ ధోని అనేంత. అంతేకాకుండా ధోని కమ్ బ్యాక్ ఎప్పుడా? అనే చర్చను పక్కకు పెట్టి.. రిషభ్ పంత్ భవితవ్యం ఏంటని ప్రశ్నించేలా? ఈ కర్ణాటక బ్యాట్స్మన్ దూకుడు కొనసాగుతోంది.
ఆస్ట్రేలియా సిరీస్లో పంత్ అనూహ్య గాయంతో కీపింగ్ గ్లౌవ్స్ను అందుకున్న రాహుల్.. ఆ సిరీస్లో బ్యాట్తో పాటు వికెట్ల వెనుకాల అద్భుతంగా రాణించాడు. తొలి వన్డేలో మూడో స్థానంలో వచ్చిన రాహుల్ 47 పరుగులతో.. రెండో వన్డేలో ఐదో స్థానంలో వచ్చి 80 పరుగులు చేశాడు. ఫైనల్ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చి 19 పరుగులే చేసినా కీపింగ్లో అదరగొట్టాడు. రివ్యూ విషయంలో కోహ్లీకి అండగా ఉంటూ.. మెరుపు రనౌట్లు, స్టంపౌట్లతో లెజెండ్ ధోనిని గుర్తు చేశాడు. అతని అద్భుత ప్రదర్శనతో ధోని రీ ఎంట్రీ డిబేట్ కాస్త పక్కదారి పట్టింది. తెరపైకి పంత్ భవితవ్యం ఏంటనే చర్చ వచ్చింది.
కీపింగ్.. బరువు కాదు కదా?
ఇక ఆస్ట్రేలియా సిరీస్లో రాహుల్ కీపర్గా సూపర్ సక్సెస్ కావడంతో కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి అతన్నే వికెట్ల వెనుకాల కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అలా చేస్తే మనీష్ పాండే రూపంలో మరో అదనపు బ్యాట్స్మన్ను జట్టులోకి తీసుకోవచ్చని కూడా తెలిపారు. అయితే ఈ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్లు గౌతం గంభీర్, సునీల్ గావస్కర్ వ్యతిరేకించారు. రాహుల్కు చెప్పే చేస్తున్నారా? లేక బరువును ఎత్తుతున్నారా? అని ప్రశ్నించారు. కీపింగ్ను అదనపు బాధ్యతలుగా భావిస్తే రాహుల్ బ్యాటింగ్పై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఇక మంచి ఫినిషర్ అయిన పంత్ భవితవ్యం ఏంటని, అతని ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అండగా నిలవాలని సూచించారు. తీరా వీరి అనుమానాలను పటా పంచల్ చేస్తూ రాహుల్ బ్యాటింగ్, కీపింగ్లో అదరగొట్టాడు.
సిరీస్ టాపర్..
ఇక తాజా సిరీస్లో 56, 57 నాటౌట్, 27,39, 45తో మొత్తం 224 పరుగులు చేసి ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా సిరీస్ టాపర్గా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు. ఈ సిరీస్లో కూడా ధోనిని మైమరిపించే కీపింగ్ విన్యాసాలతో రాహుల్ ఆకట్టుకున్నాడు. మొత్తానికి ధోని వారుసుడన్న పంత్ కన్నా వికెట్ల వెనుకాల రాహుల్ సమర్థవంతంగా రాణించాడు.
ధోనీ రీ ఎంట్రీ లేకున్నా..
సీనియర్ వికెట్ కీపర్ ధోని భవితవ్యంపై స్పష్టత లేని నేపథ్యంలో రాహుల్ రూపంలో టీమిండియాకు మంచి వికెట్ కీపర్ దొరికాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక వేళ ధోని రీ ఎంట్రీ లేకున్నా.. జట్టుకు పెద్దగా నష్టం ఉండదంటున్నారు. ఒక వేళ ధోని వచ్చినా ఎప్పటిలానే రాహుల్ తన బ్యాటింగ్పై దృష్టి సారిస్తాడని తెలుపుతున్నారు. ఇక ధోని భవితవ్యం ఐపీఎల్తో తేలనుందని ఇప్పటికే రవిశాస్త్రి, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే తెలిపిన విషయం తెలిసిందే.