|
ఐపీఎల్లో అదరగొట్టినప్పటికీ..
షమీ చివరిసారిగా టీ20ల్లో ఇండియా తరఫున 2021 టీ20 ప్రపంచ కప్లో ఆడాడు. ఇకపోతే ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున ఆడిన షమీ అద్భుతంగా రాణించాడు. అయినప్పటికీ అతన్ని ఆసియా కప్ టోర్నీకి ఎంపికచేయలేదు. గుజరాత్ టైటాన్స్ తమ తొలి సీజన్లోనే ట్రోఫీని అందుకోవడంలో షమీ కీలక పాత్ర పోషించాడు. అతను 16 గేమ్లలో 20వికెట్లతో 24.40సగటుతో సత్తా చాటాడు. భారత ఆసియా కప్ జట్టులో అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్లను మాత్రమే తీసుకున్న జట్టు మేనేజ్ మెంట్ షమీని పక్కనపెట్టింది. ఇక ప్రస్తుత సూపర్ 4 స్టేజులో భారత్ రెండు వరుస మ్యాచ్లలో ఓడిపోవడానికి ప్రధాన కారణం బౌలింగ్ వైఫల్యమని స్పష్టమవుతుంది.
|
షమీ విషయంలో జట్టు మేనేజ్ మెంట్ తేల్చుకోవాలి
'మీరు ఆసియా కప్ టోర్నీకి కేవలం నలుగురు ఫాస్ట్ బౌలర్లతో దుబాయ్ వెళ్లడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీకు అయిదో పేసర్ తప్పకుండా అవసరం. ఇంటికి పరిమితమైన మహ్మద్ షమీ లాంటి ప్లేయర్ ఈ స్టేజులో భారత్కు ఎంతో అవసరమయ్యేవాడు. అతని అబ్సెన్స్ నన్ను కలవరపెడుతుంది. ఐపీఎల్ తర్వాత అతను టీ20ల్లో భారత జట్టుకు ఎంపిక కాలేకపోయాడు.' అని శాస్త్రి బ్రాడ్కాస్టర్లతో చెప్పాడు. రవిశాస్త్రి వ్యాఖ్యల బట్టి షమీ ఇంట్లో కూచుని చెక్క భజన చేసుకోవాలా.. లేక గ్రౌండ్లో చెలరేగాలా తేల్చుకోవాల్సిన అవసరముందని జట్టు మేనేజ్మెంట్కు చెప్పకనే చెప్పేశాడు. వచ్చే టీ20 వరల్డ్ కప్ టైంకు భారత జట్టు ఎంపికలో మార్పులు ఉండే వీలుంది.
కోచ్ చేతిలో సెలెక్షన్ ఉండదు కానీ..?
ఇక కామెంట్రీ ప్యానెల్లో వసీం అక్రమ్ రవిశాస్త్రిని ఓ మాట అడిగాడు. జట్టును ఎంపిక చేయడంలో కోచ్కి ఇన్పుట్ ఉంటుందా ? అని దానికి రవిశాస్త్రి స్పందిస్తూ.. కోచ్ చేతిలో సెలెక్షన్ ఉండదు కానీ.. అతను సెలెక్షన్ విషయంలో సహకారం అందించగలడని. కొన్ని సజెషన్స్ మాత్రం ఇవ్వగలడు' అని రవిశాస్త్రి తెలిపాడు. ముఖ్యంగా షమీ న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో జరిగిన హోమ్ సిరీస్లలో ఆడలేదు. అతను ఐర్లాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్తో జరిగిన విదేశీ సిరీస్లకు కూడా ఎంపిక కాలేదు. షమీ ఇప్పటివరకు 17 టీ20ల్లో 31.55 సగటుతో 18 వికెట్లు తీశాడు.