ఫిట్గా ఉన్న ఆండ్రీ రసెల్ ఆడకపోవడమే కోల్కతాకు శాపమైందా? విండీస్ స్టార్ ఫైనల్ ఎందుకు ఆడలేదంటే!!

దుబాయ్: శుక్రవారం దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. కోల్కతా ఓడిపోవడానికి కారణం ఫైనల్లో మిడిలార్డర్ చేతులెత్తేయడమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు వెంకటేశ్ అయ్యర్ (50), శుభ్మన్ గిల్ (51) రాణించినా.. మిగతావారు పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాటర్లు నితీష్ రాణా (0), ఇయాన్ మోర్గాన్ (4), దినేష్ కార్తీక్ (9) పరుగులు చేయలేకపోయారు. వీరితో పాటు అంతకుముందు మ్యాచులో ఆకట్టుకున్న రాహుల్ త్రిపాఠి (2), షకీబ్ ఉల్ హాసన్ (0)లు బ్యాట్ జులిపించలేకపోయారు. దాంతో కోల్కతా ఫైనల్లో ఓడిపోయింది.

షకీబ్ విఫలం:
మొదటి దశలో కోల్కతా ఏడు మ్యాచులు ఆడి కేవలం రెండింటిలో విజయం సాధించింది. కానీ రెండో దశలో ఆడిన ఏడు మ్యాచుల్లో ఐదింటిలో విజయం సాధించి ప్లే ఆఫ్స్ చేరింది. ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2లో సత్తాచాటి ఫైనల్ మెట్టుపై బోల్తాపడింది. అయితే ఫైనల్ కోసం ఎంచుకున్న ప్లేయింగ్ ఎలెవెన్ కూడా కోల్కతా ఓటమికి ఓ కారణం అని విశ్లేషకులు అంటున్నారు. విండీస్ స్టార్ ఆండ్రీ రసెల్ను ఫైనల్లో ఆడిస్తే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. రసెల్ స్థానంలో ఆడిన బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబ్ ఉల్ హాసన్ పూర్తిగా నిరాశపరిచాడు. బ్యాటింగ్, బౌలింగ్లో తేలిపోయాడు. మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 33 పరుగులు ఇవ్వగా.. ఆపై బ్యాటింగ్లో కీలక సమయంలో డకౌట్ అయ్యాడు. దాంతో ఫైనల్లో రసెల్ను ఆడించివుంటే కోల్కతా గెలిచేదనే అభిప్రాయాలు వినబడుతున్నాయి.

రసెల్ ఫిట్నెస్ సాధించినా:
యూఏఈలో ఆరంభం అయిన రెండో దశ ఆరంభంలో ఆండ్రీ రసెల్ కోల్కతా నైట్ రైడర్స్ తరఫున మ్యాచులు ఆడాడు. అయితే కండరాల గాయంతో అతడు మ్యాచులు ఆడలేదు. గాయం నుంచి కొలవడానికి రసెల్ అన్నివిధాలా ప్రయతించాడు. చివరకు నాటౌట్ మ్యాచుల సమయానికి ఫిట్నెస్ సాదించాడు. దాంతో ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2లో ఆడతాడని అందరూ ఊహించారు. అది జరగలేదు. ఇక ఫైనల్లో కచ్చితంగా ఆడతాడనుకున్నా.. అదీ జరగలేదు. రసెల్ మ్యాచ్ ఫిట్నెస్ సాధించినా ఫైనల్ మ్యాచ్లో ఎందుకు ఆడలేదని అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. అయితే మ్యాచ్ అనంతరం కోల్కతా నైట్ రైడర్స్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ ఆ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు.

రిస్క్ తీసుకోదలుచుకోలేదు:
'యూఏఈలో ఐపీఎల్ 2021 మొదలయిన కొద్దిరోజులకే ఆండ్రీ రసెల్ కండరాల గాయంతో బాధపడ్డాడు. ఫిట్నెస్ సాధించడానికి చాలా కష్టపడ్డాడు. చివరకు మ్యాచ్ ఫిట్నెస్ సాదించాడు. అయినప్పటికీ అతడు ఇంకా ప్రమాదంలోనే ఉన్నాడు. ఫైనల్లో ఆడితే .. గాయం తిరగబెడుతుందేమో అనుకున్నాం. అందుకే రిస్క్ తీసుకోదలుచుకోలేదు. రాహుల్ త్రిపాఠి కూడా గాయంతో బాధపడుతున్నాడు. అతడిని ఆడించడం కూడా ప్రమాదమే. ఐతే ఫైనల్కు రావడానికి అతడు బాగా సాయపడ్డాడు. అందుకే అతడిని ఆడించాం. బ్యాటింగ్ ఆర్డర్ కూడా మార్చాము' అని కోల్కతా నైట్ రైడర్స్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ స్పష్టం చేశాడు.

అయ్యర్గానే ఉంటాడు:
'వెంకటేష్ అయ్యర్ అత్యంత స్థిరంగా ఉండకపోవచ్చు. కానీ మనం ఇప్పటివరకు చూసిన అయ్యర్గానే ఉంటాడని నేను ఆశిస్తున్నాను. ఈ క్రికెట్లో అతనికి గొప్ప భవిష్యత్తు ఉంది. వెంకటేష్ చాలా తెలివైన వ్యక్తి. ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్ చేరేందుకు అతను బాగా ఆడాడు' అని బ్రెండన్ మెక్కల్లమ్ అన్నాడు. కరోనా విరామం జట్టుకు ఉపయోగపడిందని, ఆ సమయంలో బాగా ఇఫ్రువ్ అయ్యామని మెకల్లమ్ చెప్పాడు. ద్వితీయార్ధంలో నలుగురు భారత ఆటగాళ్లు సాధించిన విజయాల గురించి ఎక్కువగా మాట్లాడలేనన్నాడు. వారు ఆడిన విధంగా ఆడటానికి ధైర్యం కావాలని మెక్కల్లమ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications