ధోనీ అందరిలాంటి కెప్టెన్ కాదు:
తాజాగా హర్భజన్ సింగ్ ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో కార్యక్రమంలో మాట్లాడుతూ ఎమ్మెస్ ధోనీ నాయకత్వ లక్షణాల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ధోనీ అందరిలాంటి కెప్టెన్ కాదు. ఇది చెయ్, అది చెయ్ అని ఆటగాళ్లకు ఎప్పుడూ చెప్పడు. నువ్వేం చేయగలవో అది మాత్రమే చేయమని చెపుతాడు. నీకెలా బౌలింగ్ చేయడం వచ్చో అలానే చేయమంటాడు. ఒకవేళ నువ్వు ఆరు ఆఫ్ స్పిన్ బంతులే వేయగలిగితే, అలాగే వేయమంటాడు' అని హర్భజన్ తెలిపాడు. పదేళ్ల పాటు ముంబై ఇండియన్స్ జట్టుకి ఆడిన హర్భజన్.. 2018 ఐపీఎల్ సీజన్ నుంచి చెన్నై టీమ్కి ఆడుతున్నాడు.
శార్దూల్ను యాంగిల్ మార్చమని ఎందుకు చెప్పవు:
'వికెట్ల వెనుక ఉండే కెప్టెన్ ధోనీ.. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ఎలా ఆడాలనుకుంటున్నారో గ్రహించి ఆ సమాచారాన్ని బౌలర్లకు అందిస్తాడు. తర్వాత బ్యాట్స్మెన్ను ఎలా కట్టడి చేయాలనుకుంటే.. అది నీపైనే ఆధారపడి ఉంటుంది. నువ్వెలా బౌలింగ్ చేయాలనుకుంటే అలా చేయొచ్చు. ఒకసారి పుణెలో పేసర్ శార్దూల్ ఠాకుర్ బాగా పరుగులిస్తున్నాడు. నేను ధోనీ వద్దకెళ్లి.. శార్దూల్ను యాంగిల్ మార్చమని ఎందుకు చెప్పవని అడిగా. అందుకు "భజ్జీ.. ఇప్పుడు నేనేమైనా చెబితే శార్దూల్ తికమకపడతాడు. అతడెలా వేయాలనుకుంటే అలానే వేయనివ్. పరుగులు సమర్పించకున్నా పర్లేదన్నాడు" అని నాతో అన్నాడు' అని హర్భజన్ చెప్పాడు.
అప్పుడే రంగంలోకి దిగుతా:
'మనం ఇప్పటికే ప్లేఆఫ్స్కు క్వాలిఫై అయినందున భారీ పరుగులు సమర్పించుకుంటామని శార్దూల్కి తెలుసు. ఒకవేళ చివరికి శార్దూల్.. తనకు పరుగులు నియంత్రించడంలో ఎలాంటి ఆలోచనలు తోచడం లేదని భావిస్తే.. అప్పుడు నేను రంగంలోకి దిగుతా. అతనికి సూచనలు చేస్తా అని ధోనీ చెప్పాడు' అని భజ్జీ పేర్కొన్నాడు. 2019 ప్రపంచకప్ తర్వాత ధోనీ.. క్రికెట్ నుంచి సుదీర్ఘ విరామం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అయినా అతను పాల్గొంటాడని అంతా భావించారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లీగ్ తాత్కాలికంగా రద్దు కావడంతో.. అదీ జరుగలేదు. ఈ నేపథ్యంలో ధోనీ రిటైర్మెంట్ మరోసారి తెరపైకి వచ్చింది.