ఒక్క స్థానం గెలవని కాంగ్రెస్:
మంగళవారం న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ విఫలమయినా.. లోకేష్ రాహుల్ అద్భుత సెంచరీ (113 బంతుల్లో 112; ఫోర్లు 9, సిక్సులు 2)తో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఇక మంగళవారమే విడుదలైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించింది. 70 స్థానాలు ఉన్న ఢిల్లీలో కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది.
కేఎల్గా మార్చుకో.. గాంధీలా కాదు:
లోకేష్ రాహుల్ జట్టు భారీ స్కోర్ సాధించడంలో సఫలం కాగా.. రాహుల్ గాంధీ తన పార్టీని ఒక్క స్థానంలో కూడా గెలిపించలేకపోయాడు. దీంతో రాహుల్ గాంధీపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. 'ఒక రాహుల్ హీరో అయితే.. మరో రాహుల్ జీరో అయ్యాడు' అని ఓ నెటిజన్ కామెంట్ చేసాడు. 'జీవితం నిన్ను రాహుల్ని చేస్తే దాన్ని కేఎల్గా మార్చుకో.. గాంధీలా కాదు' అని మరో కామెంట్ చేశాడు. ఇలానే నెటిజన్లు తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
రాహుల్ పరుగులు దాచుకో:
న్యూజిలాండ్ ఆల్రౌండర్ జిమ్మీ నీషమ్ కూడా కేఎల్ రాహుల్ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేసాడు. 20వ ఓవర్లో రాహుల్ సింగిల్ కోసం ప్రయత్నించగా.. నీషమ్ అతడికి ఎదురుగా వచ్చాడు. దీంతో రాహుల్ కొంచెం ఇబ్బంది పడ్డాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం నీషమ్ దీనిపై ఓ సరదా ట్వీట్ చేశాడు. 'రాహుల్ కాస్త పరుగులు దాచుకో. ఏప్రిల్లో మరిచిపోకుండా సాధించు' అని రాసుకొచ్చాడు. 'పేపర్, సిజర్స్, రాక్' అంటూ నవ్వుతున్న ఎమోజీలను మరో ట్వీట్లో పెట్టాడు.
రాహుల్ సెంచరీ:
మూడో వన్డేలో భారత్పై న్యూజిలాండ్ అయిదు వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. మొదటగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. లోకేష్ రాహుల్ సెంచరీ (113 బంతుల్లో 112; ఫోర్లు 9, సిక్సులు 2)తో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్ (63 బంతుల్లో 62; ఫోర్లు 9) హాఫ్ సెంచరీతో రాణించాడు. కివీస్ బౌలర్ బెన్నెట్ 4 వికెట్లు తీసాడు. 297 పరుగుల లక్ష్యంను కివీస్ 47.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మార్టిన్ గప్టిల్ (46 బంతుల్లో 66: 6 ఫోర్లు, 4 సిక్సర్లు), హెన్రీ నికోల్స్ (103 బంతుల్లో 80: 9 ఫోర్లు), కొలిన్ డి గ్రాండ్హోమ్ (28 బంతుల్లో 58: 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేసి కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత బౌలర్ చహల్ మూడు వికెట్లు తీసాడు.