నురుల్ ఆరోపణలు..
ఈ మ్యాచ్ ముగిసే వరకు కేవలం అంపైర్ల మీదనే బంగ్లా, పాక్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బౌలర్ షార్ట్ బాల్ వేసినప్పుడు కోహ్లీ.. అంపైర్ల వైపు చూసి నోబాల్ కోసం అప్పీల్ చేయడం, అంపైర్లు నోబాల్ ఇవ్వడాన్ని కూడా బంగ్లా అభిమానులు తప్పుబట్టారు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత బంగ్లా వికెట్ కీపర్ బ్యాటర్ నురుల్ హసన్ సంచలన ఆరోపణలు చేశాడు. తమ జట్టు బ్యాటింగ్ చేసే సమయంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని ఆరోపించాడు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
బంగ్లాకు నిపుణులు సలహాలు
అయితే కోహ్లీ చేసిన చర్యను ఎవరూ గమనించలేదని, ఈ విషయంలో ఎవరినీ తప్పుబట్టలేమని పలువురు మాజీలు, నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రఖ్యాత కామెంటేటర్ హర్ష భోగ్లే కూడా ఇదే విషయం చెప్తూ ట్వీట్ చేశాడు. కోహ్లీ చేసిన పనిని బ్యాటర్లు, అంపైర్లు, చివరకు కామెంటరీ ప్యానెల్లో ఉన్న తాము కూడా గుర్తించలేదని భోగ్లే చెప్పాడు. అదే సమయంలో ఒక్క బంగ్లా బ్యాటర్ కుదురుగా బ్యాటింగ్ చేసి ఉన్నా ఆ జట్టు గెలిచేదని అభిప్రాయపడ్డాడు.
100శాతం అది ఫేక్ ఫీల్డింగ్
దీనిపై తాజాగా భారత మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. తన యూట్యూబ్ ఛానెల్లో దీనిపై మాట్లాడిన ఆకాశో చోప్రా.. కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ వీడియో చూశానని చెప్పాడు. 'అది కచ్చితంగా ఫేక్ ఫీల్డింగే. దాన్ని ఎవరూ చూడలేదు కాబట్టి మన జట్టు బతికిపోయింది. ఒక విధంగా అంపైర్ల వైఫల్యం మనకు కలిసొచ్చింది. దాన్ని ఎవరూ చూడలేదు కాబట్టి ఇప్పుడేం చెయ్యలేం' అని అన్నాడు. అదే సమయంలో కోహ్లీ చర్యను అంపైర్లు గమనించి ఉంటే బంగ్లా జట్టుకు ఐదు పరుగులు అదనంగా దక్కేవని, దానికితోడు ఆ జట్టు తీసిన రెండు పరుగులు కూడా ఆ జట్టుకు లభించేవని వివరించాడు.అదే సమయంలో ఆ బంతిని డెడ్ బాల్గా పరిగణించే వారని చెప్పిన ఆకాశ్.. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని ఆటగాళ్లకు సూచించాడు