భారీగా ప్రైజ్ మనీ
ఫిఫా వరల్డ్ కప్లో జట్లకు భారీగా నగదు బహుమతులు అందుతాయి. ఈ ప్రపంచకప్ గెలిచన జట్టుకు ఏకంగా 42 మిలియన్ డాలర్లు అంటే రూ.342 కోట్లపైగా బహుమతి దక్కుతుంది. అలాగే రెండో స్థానంలో నిలిచిన జట్టుకు 30 మిలియన్ డాలర్లు అంటే రూ.244 కోట్లపైగా ప్రైజ్ మనీ అందిస్తారు. ఇంత భారీ ప్రైజ్మనీ మరే క్రీడలోనూ దక్కదనడంలో తప్పేమీ లేదు. ఈ లెక్కన క్రికెట్ కూడా ఫుట్బాల్ రేంజ్ చేరుకోవాలంటే చాలా కాలం పడుతుంది.
టీ20 వరల్డ్ కప్తో పోలిస్తే..
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్లో విజేత ఇంగ్లండ్కు దక్కిన ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? 1.6 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.13 కోట్లు దక్కించుకుంది. రెండో స్థానంలో నిలిచిన పాకిస్తాన్కు 8 లక్షల డాలర్లు అంటే మన లెక్కల్లో రూ.6.5 కోట్లపైగా బహుమతి దక్కింది. టీ20 వరల్డ్ కప్ మొత్తానికి కేటాయించిన నగదు 5.6 మిలియన్ డాలర్లు మాత్రమే. ఇదే క్రికెట్ ప్రపంచానికి భారీగా కనిపిస్తోంది. మరి ఫిఫా వరల్డ్ కప్తో పోలిస్తే ఈ ప్రైజ్ మనీ ఏపాటిదో చూడండి.
వన్డే వరల్డ్ కప్ విజేతకు..
టీ20 ప్రపంచకప్తో పోలిస్తే వన్డే వరల్డ్ కప్లో ప్రైజ్ మనీ ఎక్కువగా ఉంటుందని తెలిసిందే. ఈ లెక్కన 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో బౌండరీ కౌంట్ ఆధారంగా గెలిచిన ఇంగ్లండ్ జట్టుకు దక్కిన ప్రైజ్ మనీ 4 మిలియన్ డాలర్లు (రూ.32 కోట్లకు పైగా), రన్నరప్ న్యూజిల్యాండ్కు 2 మిలియన్ డాలర్లు (రూ.16 కోట్లకుపైగా) నగదు బహుమతి దక్కింది. సెమీఫైనల్లో ఓడిన ఆస్ట్రేలియా, భారత్ జట్లకు చెరో 8 లక్షల డాలర్లు (రూ.6.5 కోట్లపైగా) బహుమతి అందించారు. ఈ టోర్నీలో మొత్తం నగదు బహుమతు కోసం 10 మిలియన్ డాలర్లు (రూ.81 కోట్లపైగా) కేటాయించారు.
ఫుట్బాల్ క్రేజే సపరేటు
ప్రపంచ వ్యాప్తంగా ఫుట్బాల్ క్రీడకు ఉన్న క్రేజ్ వేరు. అందుకే ఫిఫా కూడా దీన్ని అభివృద్ధి చేసేందుకు చాలా కృషి చేస్తోంది. ఈ ఏడాది జరుగుతున్న వరల్డ్ కప్ ప్రైజ్ మనీ కోసం ఏకంగా 440 మిలియన్ డాలర్లను కేటాయించింది. మన లెక్కల్లో ఇది రూ.3587 కోట్ల రూపాయలన్నమాట. సుమారు బీసీసీఐ రెవెన్యూ అంత అన్నమాట. అంతేకాదు వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే మహిళా వరల్డ్ కప్ కోసం కూడా ఏకంగా 60 మిలియన్ డాలర్లు (సుమారు రూ.490 కోట్లు) కేటాయించింది ఫిఫా.