న్యూజిల్యాండ్తో మూడు టీ20ల సిరీస్ను టీమిండియా రాంచీ వేదికగా మొదలు పెట్టనుంది. ఇక్కడి జేఎస్సీఏ మైదానంలో భారత్, న్యూజిల్యాండ్ జట్లు తలపడేందుకు రెడీ అయ్యాయి. ఇక్కడి పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం మాత్రం కాదు. స్లో బౌలర్లు, స్పిన్నర్లకు పిచ్ నుంచి సహకారం లభిస్తుంది. అంతేకాదు, ఈ మైదానంలో భారత్ ఇప్పటి వరకు మూడు అంతర్జాతీయ టీ20లు ఆడింది. ఈ మూడింటిలోనూ టీమిండియానే గెలుపొందటం గమనార్హం.
ఇక్కడ చివరగా భారత్ ఆడిన మ్యాచ్లో కూడా ప్రత్యర్థి కివీస్ జట్టే కావడం విశేషం. ఆ మ్యాచ్లోనే టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్టు హర్షల్ పటేల్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్లో తొలుత న్యూజిల్యాండ్ బ్యాటింగ్ చేసింది. ఓపెనర్గా వచ్చిన డారియల్ మిచెల్ (28 బంతుల్లో 31) ఫర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (15 బంతుల్లో 31) రెచ్చిపోయాడు. అయితే మిగతా బ్యాటర్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. దీంతో ఒకానొక దశలో 90/3 స్కోరుతో పటిష్ట స్థితిలో కనిపించిన కివీస్.. 140/6కు చేరింది. చివరకు 153 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఒక మోస్తరు లక్ష్యంతో బరిలో దిగిన భారత్కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం అందించారు. రోహిత్ శర్మ (36 బంతుల్లో 65) అదరగొట్టగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (49 బంతుల్లో 65) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. వీళ్లిద్దరూ తొలి వికెట్కు 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ విజయం దాదాపు ఖరారైంది.
ఆ తర్వాత వచ్చిన రిషభ్ పంత్ కూడా చెలరేగాడు. జిమ్మీ నీషమ్ బౌలింగ్లో వరుస సిక్సర్లతో భారత్ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో మరో 16 బంతులు మిగిలుండగానే ఆరు వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. మరి ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ను టీమిండియా రిపీట్ చేస్తుందేమో చూడాలి.