
హైదరాబాద్: విశాఖ వేదికగా ఆతిథ్య టీమిండియాతో జరిగే రెండో వన్డేలో వెస్టిండిస్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేయాలని ఆ జట్టు కెప్టెన్ జాసన్ హోల్డర్ సూచించాడు. ఐదు వన్డేల సిరిస్లో భాగంగా బుధవారం జరగనున్న రెండో వన్డేకి విశాఖలోని వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇందుకోసం ఇప్పటికే వైజాగ్ స్టేడియం పూర్తిగా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రెండో వన్డేకి ముందు మీడియాతో జాసన్ హోల్డర్ మాట్లాడుతూ "పరిమిత ఓవర్ల క్రికెట్లో.. కొత్త బంతిని బౌలర్లు వినియోగించుకోవాలి. మ్యాచ్ ఆరంభంలోనే కనీసం ఓ రెండు మూడు వికెట్లు తీస్తే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టొచ్చు" అని అన్నాడు.
"తొలి వన్డేలో మేం ఒక్క వికెట్ (ధావన్) మాత్రమే తీయగలిగాం. ఒకవేళ అలానే క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ధావన్ తర్వాత.. మరో రెండు వికెట్లు తీయగలిగింటే, భారత మిడిలార్డర్పై ఒత్తిడి పెరిగేది. పేలవ బౌలింగ్ కారణంగా మ్యాచ్ని కాపాడుకోలేకపోయాం. రోహిత్-కోహ్లీ భాగస్వామ్యాన్ని విడదీసింటే ఫలితం మరోలా ఉండేది" అని హోల్డర్ తెలిపాడు.
గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియాకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ... పేలవ బౌలింగ్ కారణంగా వెస్టిండీస్ జట్టు ఓడిపోవడం బాధించిందని హోల్డర్ చెప్పుకొచ్చాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది.
అనంతరం 323 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 42.1 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (140), రోహిత్ శర్మ(152 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా అలవోక విజయాన్ని నమోదు చేసింది.