
హనుమ విహారి మీడియా సమావేశంలో ఇలా
మ్యాచ్ అనంతరం హనుమ విహారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ "అతిగా ఆలోచించడం మానుకోవడం మంచిది. ఒడుదొడుకులు ఉంటే రాణించలేం. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొంటే విజయవంతం అవుతాం. బ్యాట్స్మెన్గా మేం చాలా క్రమశిక్షణతో ఆడటం ముఖ్యం. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో మేమదే చేశాం" అని అన్నాడు.

రెండో రోజు ఉదయం ఆట చాలా కీలకం
"ఒక్కో బంతిని ఆడుతూ పోవాలి. ముందు బంతి గురించి ఆలోచిస్తే తర్వాతి బంతిని బాగా ఆడలేం. రెండో రోజు ఉదయం ఆట చాలా కీలకం. ఆస్ట్రేలియాను 320 పరుగుల లోపు కట్టడిచేస్తే మేము పోటీలో ఉన్నట్లు. లేకపోతే ప్రత్యర్థి జోరుకు తలొగ్గినట్లే. బ్యాటింగ్ పరంగా మొదటి గంట కీలకంగా భావిస్తున్నాం. క్రమశిక్షణతో ఆడటం ముఖ్యం" అని హనుమ విహారి చెప్పాడు.
ఆసీస్కు దీటైన సవాల్ విసురొచ్చు
"క్రీజును అంటిపెట్టుకుంటూ ప్రణాళిక ప్రకారం బ్యాటింగ్ చేస్తే ఎలాంటి ముప్పు ఉండదు. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లాగా బ్యాట్స్మెన్ బాధ్యతాయుతంగా రాణిస్తే ఆసీస్కు దీటైన సవాల్ విసురొచ్చు. బంతి బంతికి పరిణతి కనబరుస్తూ బ్యాటింగ్ కొనసాగించాల్సి ఉంటుంది. అలా గాకుండా అనవసరషాట్లకు పోతే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది" అని అన్నాడు.
కోహ్లీ క్యాచ్ అద్భుతం
"తొలిరోజు కొన్ని అవకాశాలు చేజార్చుకున్నాం. ఆటలో ఇవన్నీ సహజం. బౌన్స్ రాబట్టేందుకు త్వరగా బంతులు వేసేందుకు ప్రయత్నించా. రంజీ, పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ నేను బౌలింగ్ చేశా. అవసరమైనప్పుడు నేను బౌలింగ్ చేయాలని తెలుసు. జట్టుకు అవసరమైన రీతిలో ఉపయోగపడేందుకు నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటా. అది బ్యాటింగ్లోనైనా, బౌలింగ్లోనైనా సరే. జట్టులో నా పాత్రేంటో స్పష్టంగా తెలుసు. కట్టుదిట్టంగా బంతులు వేసేందుకు ప్రయత్నిస్తా. వికెట్లు పడితే బోనస్ వచ్చినట్టే. విరాట్ కోహ్లీ క్యాచ్ అద్భుతం. అలాంటి ఘటనలు మ్యాచ్ గమనాన్నే మార్చేస్తాయి" అని విహారి పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications












