హైదరాబాద్: ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా 1-2 తేడాతో వన్డే సిరీస్ను కోల్పోయింది. ఇంతకుముందు జరిగిన టీ20 సిరీస్ను 2-1 తేడాతో గెలిచిన టీమిండియాను ఇంగ్లాండ్ చిత్తుగా ఓడించిందని ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చెప్పుకొస్తున్నాడు. అంతేకాదు, టీమిండియాతో వన్డే సిరీస్లో తమ ప్రదర్శన అద్భుతమంటూ ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అన్నాడు.
తొలి రెండు మ్యాచుల్లో చేసిన పొరపాట్లను త్వరగా సరిదిద్దుకొని సిరీస్ కైవసం చేసుకున్నామంటూ చెప్పుకొచ్చాడు. నిర్ణయాత్మక చివరి వన్డేలో జోరూట్ సెంచరీ సాధించడంతో భారత్ నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 44.3 ఓవర్లలోనే ఛేదించగలిగింది. ఇంగ్లాండ్ ఛేదనలో రూట్, మోర్గాన్ అజేయంగా నిలిచి 186 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. రూట్ వరుసగా రెండో సెంచరీ సాధించాడు.
'ముందు మా ఆరంభం పేలవం. సిరీస్ ముందుకు వెళ్తున్న కొద్దీ మెరుగయ్యాం. ద్వైపాక్షిక సిరీస్లు ఆడటం వల్ల కలిగే ప్రయోజనం ఇదే. ట్రెంట్బ్రిడ్జి నుంచి మా ప్రదర్శన నిలకడగా మెరుగైంది. చివరి మ్యాచ్లోనైతే ఇంకా అద్భుతం. మైదానంలో అడుగు పెట్టినప్పటి నుంచి చక్కగా ఆడాం. డేవిడ్ విలేతో కలిసి మార్క్వుడ్ నాలుగైదు ఓవర్లు మంచి స్వింగ్ రాబట్టాడు. అప్పట్నుంచే టీమిండియా మా నుంచి తప్పించుకోలేదని అనిపించింది' అని మోర్గాన్ వివరించాడు.
'టెస్టు సిరీస్ ముంగిట రూట్ ప్రదర్శన జట్టుకు ప్రోత్సాహకరం. గత రెండు మ్యాచ్లలో అతడి ప్రదర్శన అనూహ్యం. ఫామ్లో లేకున్నా పూర్తి ఆత్మవిశ్వాసంతో రాణించాడు. పరుగుల దాహంతో కనిపిస్తాడు. తన సెంచరీతో ఇంగ్లాండ్ అత్యుత్తమ బ్యాట్స్మెన్ జాబితాలో అగ్రస్థానానికి చేరాడు. ఇంకా.. రూట్ జట్టుకు ఎంతగానో ఉపయోగపడతాడు. కుల్దీప్ను మేం తెలివిగా ఎదుర్కొన్నాం. అతడిని ఎదుర్కోవడంలో జో రూట్ మిగతా ఆటగాళ్లకు సహాయ పడ్డాడు. ఆదిల్ రషీద్ తన బౌలింగ్ను రోజు రోజుకు మెరుగు పరుచుకుంటున్నాడు' అని మోర్గాన్ తెలిపాడు.