హైదరాబాద్: వరుస విజయాలతో ఢీలా పడిన ఢిల్లీ డేర్డెవిల్స్ ఎట్టకేలకు సొంతగడ్డపై విజయం సాధించింది. మంగళవారం ఫిరోజ్ షా కోట్లా వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఢిల్లీ తాత్కాలిక కెప్టెన్ కరుణ్ నాయర్ మాట్లాడాడు.
సన్రైజర్స్పై విజయం సాధించడంతో సంతోషం వ్యక్తం చేశాడు. జట్టులో యువకులు ఉన్నారని, ఎలాంటి భయం లేకుండా ఆడటమే సన్రైజర్స్పై విజయానికి కారణమని చెప్పాడు. 'బౌలర్లు శ్రమించినా సన్రైజర్స్ భారీ స్కోరు చేసింది. యువీ ఇచ్చిన క్యాచ్ను మా వాళ్లు వదిలేయడంతో వారికి కలిసొచ్చింది. లైఫ్ రావడంతో యువరాజ్ విజృంభించి ఆడాడు. లేకపోతే మాకు విజయం సులువుగా సాధ్యమయ్యేది' అని కరుణ్ నాయర్ చెప్పాడు.

ఇక సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ ఢిల్లీ డేర్డెవిల్స్ అద్భుత ప్రదర్శన చేసిందని చెప్పాడు. 186 పరుగుల లక్ష్యం ఛేదించడం కష్టమని భావించామని, కానీ ఢిల్లీ సొంత మైదానం ఫిరోజ్ షాలో అద్బుతం చేసిందని చెప్పాడు. సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్కి ఢిల్లీ రెగ్యులర్ కెప్టెన్ జహీర్ ఖాన్ దూరం కావడంతో కరుణ్ నాయర్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు.
కాగా, మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 185 పరుగులు చేయగా, అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసి ఈ సీజన్లో మూడో విజయాన్ని నమోదు చేసింది.