ఆక్లాండ్: టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్న భారత్తో జరిగిన వన్డే, టెస్టు సిరీస్లను గెలవడంతో తమ జట్టు విశ్వాసం మరింత పెరిగిందని న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ అభిప్రాయపడ్డాడు. ఇటీవలే ముగిసిన న్యూజిలాండ్ పర్యటనలో కోహ్లీసేన టీ20ల సిరీస్ను 5-0తో కైవసం చేసుకుంది. అయితే వన్డే సిరీస్ను 0-3తో, టెస్టు సిరీస్ను 0-2తో కోల్పోయింది. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్లో కివీస్ పిచ్లపై భారత బ్యాట్స్మెన్ ఒక్కరూ కూడా ఆకట్టుకోలేకపోయారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే దారుణంగా విఫలమయ్యాడు.
IND vs SA: కరోనా ఎఫెక్ట్.. బంతికి లాలాజలంను రుద్దమంటున్న భువీ!!
గ్యారీ స్టీడ్ మాట్లాడుతూ... 'భారత్ సిరీస్లో ప్రదర్శనతో మా విశ్వాసం మరింత రెట్టింపైంది. సొంత మైదానంలో టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్న భారత్ను 0-2తో ఓడించాం. అంతేకాక వన్డే సిరీస్లోనూ సత్తాచాటాం. గత నాలుగేళ్లుగా వన్డేల్లో గొప్పగా ఆడుతున్నాం. ఏ ఒక్క ఆటగాడిపైనే పూర్తిగా ఆధారపడడం లేదు. కెప్టెన్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. జట్టు సమిష్టి కృషి వల్లే విజయాలు సాధ్యమవుతున్నాయి. దీనిని ఇలానే కొనసాగించాలని ఆశిస్తున్నాం' అని తెలిపాడు.
'ప్రస్తుతం ఆస్ట్రేలియా సిరీస్కు సన్నద్ధమవుతున్నాం. మేం ఆసీస్తో పరిమిత ఓవర్ల క్రికెట్ను క్రమం తప్పకుండా ఆడుతున్నాం. ఆసీస్ గొప్ప జట్టు. వారు ఆడే విధానాన్ని ఆస్వాదిస్తాం. ఇది వేరే సిరీస్. టెస్ట్ సిరీస్లో ఆడని ఆడని ఆటగాళ్లు ఉన్నారు. సొంత గడ్డపై ఆస్ట్రేలియా ఎప్పుడూ ప్రమాదకరమే. ప్రపంచ క్రికెట్ అన్నింటిలోకెల్లా ఇక్కడ ఆడడం చాలా కష్టం. దక్షిణాఫ్రికాలో ఆసీస్ పరాజయం పాలయింది. చాలా జట్లు విదేశీ గడ్డలపై విఫలమవుతున్నాయి. మేము కూడా దీనికి అతీతం ఏమీ కాము. అతిపెద్ద సవాలు ముందుండి' అని గ్యారీ స్టీడ్ అన్నాడు.
గురువారం నుంచి దక్షిణాఫ్రికాతో భారత్ స్వదేశంలో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. మరోవైపు కివీస్ కూడా శుక్రవారం నుంచి ఆస్ట్రేలియా పర్యటన ఆరంభించనుంది. ఆసీస్తో న్యూజిలాండ్ మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఆసీస్ చేరుకున్న కివీస్ ప్రాక్టీస్ చేస్తోంది.