పోర్ట్ ఆఫ్ స్పెయిన్: తాము ర్యాంకుల కోసం ఆడటం లేదని టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. వెస్టిండీస్తో నాలుగో టెస్టు వర్షం కారణంగా రద్దు కావడంతో నాలుగు టెస్టుల సిరీస్ను భారత్ 2-0 తేడాతో సిరీస్ను గెలుచుకుంది. అయితే టెస్టుల్లో నెం.1 ర్యాంక్ను మాత్రం చేజార్చుకుంది. దీనిపై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు.
ర్యాంకులు ఎప్పుడూ స్థిరంగా ఉండవని అందువల్లే తాము ర్యాంకులు కోసం ఆడట్లేదని స్పష్టం చేశాడు. లోయర్ ఆర్డర్లో తమ జట్టు ప్రదర్శన ఎంతో మెరుగుపడిందని, ముఖ్యంగా ఆర్ అశ్విన్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అద్భుతంగా రాణించారని కోహ్లీ కొనియాడాడు.
ఈ సిరీస్ తమకు ఎంతో ఉపయోగపడిందని, ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు త్వరగా పెవిలియన్ బాట పట్టినప్పుడు లోయర్ ఆర్డర్లో వచ్చిన ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేశారన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో చేపట్టిన మార్పులతో మంచి ఫలితం వచ్చిందన్నాడు.

ఈ సిరీస్లో లోయర్ ఆర్డర్లో వచ్చిన వృద్ధిమాన్ సాహతో ఆరో స్థానంలో వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ కూడా రాణించడం తమకు బాగా కలిసొచ్చిందని చెప్పుకొచ్చాడు. మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో వీరిద్దరూ శతకాలు కూడా సాధించారని కోహ్లీ గుర్తుచేశాడు.
జట్టులో ఇలాంటి మార్పులు ఎంతో అవసరమని.. కొద్ది రోజుల్లో స్వదేశంలో న్యూజిలాండ్తో జరగబోయే టెస్టు సిరీస్లో ఇలాంటి కాంబినేషన్లు ప్రయత్నిస్తామని కోహ్లీ తెలిపాడు. కాగా, ఆగస్టు 27, 28న అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగే రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్, విండీస్ తలపడనున్నాయి.
ద్రోణాచార్య అవార్డు పొందిన కోచ్కి శుభాకాంక్షలు
క్రికెట్ కోచ్ రాజ్కుమార్ శర్మకు టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు తెలిపాడు. సోమవారం కేంద్ర ప్రభుత్వం ద్రోణాచార్య, ధ్యాన్చంద్, అర్జున, ఖేల్రత్న అవార్డు విజేతలను ప్రకటించిన సంగతి తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ద్రోణాచార్య పురస్కార విజేతల్లో రాజ్కుమార్ శర్మ ఒకరు. ఈ సందర్భంగా కోహ్లీ ట్విట్టర్ వేదికగా రాజ్కుమార్కు శుభాకాంక్షలు తెలిపాడు. ద్రోణాచార్య పురస్కారానికి రాజ్కుమార్ ఎంపిక పట్ల కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. కోహ్లీ తన చిన్నతనంలో రాజ్కుమార్ వద్ద శిక్షణ పొందడం గమనార్హం.