లాడర్హిల్: పిచ్ పరిస్థితులను అంచనా వేయలేకపోయాం. మరిన్ని పరుగులు చేస్తే మ్యాచ్ ఛాలెంజింగ్గా ఉండేది అని వెస్టిండీస్ కెప్టెన్ కార్లోస్ బ్రాత్వైట్ అన్నాడు. శనివారం రాత్రి వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. టీమిండియా పేసర్లు చెలరేగడంతో విండీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 100 పరుగులు కూడా చేయలేకపోయింది.
150 కిలోమీటర్ల వేగంతో బంతులేయడం మాటలు కాదు.. సైనీ ఆకలితో ఉన్నాడు
మ్యాచ్ అనంతరం బ్రాత్వైట్ మాట్లాడుతూ... 'పిచ్ నెమ్మదిగా ఉండడంతో మా బ్యాట్స్మెన్ పరిస్థితులను అర్థం చేసుకోలేకపోయారు. సీనియర్ కీరన్ పొలార్డ్ అద్భుతంగా రాణించాడు. కీలక సమయంలో అతడి అనుభవం జట్టుకు పనికొచ్చింది. ఈ పిచ్పై 130-140 పరుగులు చేస్తే ఛాలెంజింగ్గా ఉండేది. మేము తక్కువ పరుగులే చేసినా బౌలర్లు బాగా కట్టడి చేశారు. దూకుడుగా క్రికెట్ ఆడమని కుర్రాళ్లకు సూచిస్తాం. ముఖ్యంగా పరిస్థితులకు తగ్గట్టు ఆడతామని తెలియజేయాలి. షాట్ ఎంపికలో కూడా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. పొట్టి ఫార్మాట్లో సునీల్ నాలుగు ఓవర్లు చాలా ముఖ్యమైనవి. రాబోయే మ్యాచ్ల్లో మంచి ప్రదర్శన చేస్తాం' అని బ్రాత్వైట్ ధీమా వ్యక్తం చేసాడు.
తొలి టీ20లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో విండీస్ పర్యటనను టీమిండియా విజయంతో ఆరంభించింది. విండీస్ నిర్దేశించిన 96 పరుగుల లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఛేదనలో రోహిత్ శర్మ (24), విరాట్ కోహ్లీ (19), మనీష్ పాండే (19)లు పర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో కాట్రెల్, సునీల్ నరైన్, కీమో పాల్లు తలో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు విండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. సైనీ (3/17) విండీస్ బ్యాట్స్మెన్ను వణికించాడు.
వెస్టిండీస్తో తొలి టీ20.. కోహ్లీ సరికొత్త రికార్డు
సైనీ తన తొలి ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. నాలుగు ఓవర్ల స్పెల్లో ఏకంగా 19 డాట్ బాల్స్ ఉండటం విశేషం. జట్టులో అత్యధిక డాట్ బాల్స్ వేసింది కూడా సైనీనే. చివరి ఓవర్ను సైనీ మెయిడిన్గా వేయడం మరో విశేషం. పొలార్డ్ వంటి హార్డ్ హిట్టర్కు వరుసగా రెండు డాట్స్ వేయడంతో పాటు మూడో బంతికి అతన్ని ఔట్ చేసాడు. మిగతా మూడు బంతులకూ కూడా ఒక్క పరుగు ఇవ్వకుండా మెయిడిన్ వేసాడు.