కోహ్లీ మాట్లాడుతూ
కోహ్లీ మాట్లాడుతూ "ఎక్కువ అనుభవంతో కాకపోయినా, ప్రపంచంలో ఎక్కడైనా గెలవగలమని నమ్ముతున్నాం. మనం ఎక్కడైనా గెలవగలం - ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లాంటి దేశాలు మనల్ని అనుసరించబోతున్నాయి" అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఈ సిరీస్ చాలా గొప్పగా సాగిందనీ, సిరీస్ విజయం సమిష్టిగా సాధించిందని కెప్టెన్ తెలిపాడు.
ఎంతో గర్వంగా ఉంది
"జట్టు మొత్తాన్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. విదేశాల్లో సైతం ప్రతి గేమ్లో సత్తా చాటాం. మేము గెలవాలని కోరుకుంటున్నాం. కఠిన శ్రమ, మైండ్సెట్ అనేవి గెలుపోటములను నిర్దేశిస్తాయి. నిజాయితీగా చెప్పాలంటే ప్రపంచంలో అత్యుత్తమంగా ఉండేందుకు అన్ని కోణాల్లో ముందుకు పోవాలి" అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.
స్పిన్ బౌలింగ్ మా బలం
"స్పిన్ బౌలింగ్ మా బలం. కొత్త కుర్రాళ్లు వచ్చి ఫాస్ట్బౌలింగ్ విభాగాన్ని కూడా పటిష్టం చేశారు. ఈ సమకాలీన సిరీసుల్లో మా పేస్ బౌలర్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు. షమీ, ఉమేష్, ఇషాంత్ ఈ సిరీస్లో ఆద్భుతంగా రాణించారు. ఫీల్డింగ్లో కూడా టీమిండియా ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ప్రస్తుతం టీమిండియా అన్ని విభాగాల్లోనూ సమతూకంగా ఉంది" అని కోహ్లీ చెప్పాడు.
రోహిత్ ఓపెనర్గా
"బ్యాటింగ్లో రోహిత్ ఓపెనర్గా విజయవంతమవడం మా జట్టుకు అదనపు బలం. మయాంక్కు అతను సరైన జోడీగా కుదిరాడు. రహానే సైతం ఫుల్ ఫామ్లో ఉన్నాడు. లోయర్ ఆర్డర్లో జడేజా, అశ్విన్, సాహా ఎలాగూ ఉన్నారు" అని విరాట్ కోహ్లీ తెలిపాడు. ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్లో టీమిండియా అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.
రొటేషన్ పద్ధతిలో టెస్ట్ మ్యాచ్లు
భారత్లో రొటేషన్ పద్ధతిలో టెస్ట్ మ్యాచ్లు నిర్వహించడంపై కోహ్లీ స్పందించాడు "దేశంలోని అన్ని వేదికల్లోనూ టెస్ట్ మ్యాచ్లు ఆడించాల్సిన అవసరం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్ల కోసం రోటేషన్ పద్ధతి పాటించినా.. టెస్ట్ మ్యాచ్లను ఎప్పుడూ ఐదు వేదికల్లో నిర్వహిస్తే బాగుంటుంది. అప్పుడే ఆటగాళ్లకు పిచ్ల గురించి అవగాహన ఉంటుంది" అని కోహ్లీ తెలిపాడు.