
జట్టుకు పలు సూచనలు:
తాజాగా జో రూట్ మాట్లాడుతూ... 'దక్షిణాఫ్రికా పర్యటనలో మా జట్టు అనారోగ్యానికి గురైంది. అయితే తొందరగానే కోలుకున్నాం. వైరస్ల కారణంగా.. వీలైనంత మేరకు ఇతరులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. అధికారికంగా మా వైద్య బృందం జట్టుకు పలు సూచనలు చేసింది. ప్రమాదకర బ్యాక్టీరియా దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆటగాళ్లకు ఇప్పటికే సూచించింది' అని తెలిపాడు.

ఆటగాళ్లతో చేతులు కలపబోం:
'ఇకనుంచి మైదానంలో మరింత జాగ్రత్తగా ఉంటాం. ఆటగాళ్లతో చేతులు కలపబోం. అందుకు బదులు ఫిస్ట్ బంప్స్ (పిడికిళ్లతో పలకరింపు) పద్ధతిని పాటిస్తాం. మేం తరచూ చేతులు కడుక్కొని శుభ్రత పాటిస్తున్నాం. మాకు ఇచ్చిన ఇమ్యూనిటీ ప్యాక్లలో ఉన్న యాంటీ బాక్టీరియల్ వైప్స్, జెల్స్ ఉపయోగిస్తున్నాం' అని జో రూట్ పేర్కొన్నాడు.

యథావిధిగా శ్రీలంక సిరీస్:
'కరోనా విజృంభిస్తున్నా లంక సిరీస్ నిర్వహణకు ఆటంకం కలుగుతుందనే సమాచారం లేదు. ఎల్లప్పుడూ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. వారి సూచన మేరకే మేం నడుచుకుంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఇంగ్లాండ్-శ్రీలంక టెస్టు సిరీస్ యథావిధిగా కొనసాగుతుంది' అని జో రూట్ చెప్పుకొచ్చాడు.

దక్షిణాఫ్రికా పర్యటనలో అనారోగ్య సమస్యలు:
ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఇంగ్లండ్ జట్టు అక్కడ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంది. పది మంది ఆటగాళ్లతో పాటు కొందరు సహాయక సిబ్బందికి సైతం అంతుచిక్కని వైరస్ సోకింది. అనంతరం వారు త్వరగా కోలుకున్నారు. ఈ నేపథ్యంలో లంకతో జరగబోయే టెస్టు సిరీస్లో కరచాలనం చేయమంటున్నారు. ఇంగ్లండ్-శ్రీలంక జట్ల మధ్య మార్చి 19 నుంచి 31 వరకు రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. అంతకుముందు ఇంగ్లండ్-శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్ XIతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడనుంది.


Click it and Unblock the Notifications












