మ్యాచ్ రద్దు కావడం దురదృష్టకరం:
మ్యాచ్ రద్దు అనంతరం భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ... 'వాతావరణం కారణంగా మ్యాచ్ రద్దు కావడం దురదృష్టకరం. ఐసీసీ రూల్స్ ప్రకారం మేము ఫైనల్కు చేరాం. భవిష్యత్తులో మెగా టోర్నీల నాకౌట్ మ్యాచ్లకు 'రిజర్వ్ డే' కచ్చితంగా ఉండాలి. ఈ టోర్నీ తొలి రోజు నుంచి మేము ఒకే ఆలోచనతో ఉన్నాం. గ్రూప్లో మొత్తం మ్యాచ్లను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం' అని అన్నారు.
అలా అయితే ఫైనల్కు చేరడం కష్టమయ్యేది:
'గ్రూప్ మ్యాచ్లు అన్ని గెలవాలని అప్పుడే నిశ్చయించుకున్నాం. ఒకవేళ సెమీ ఫైనల్కు ఏమైనా ఆటంకాలు వస్తే అప్పుడు గ్రూప్లో మ్యాచ్లను పరిగణిలోకి తీసుకుంటారని తెలుసు. మేము గ్రూప్-ఎలో టాపర్గా నిలిచుండకుంటే, అదే సమయంలో సెమీ ఫైనల్ మ్యాచ్ రద్దయితే అప్పుడు ఫైనల్కు చేరడం కష్టమయ్యేది. వామ్మో.. అది ఊహించడానికే చాలా కష్టంగా ఉంది' అని హర్మన్ ప్రీత్ పేర్కొన్నారు.
ప్రతీ ఒక్కరూ ఫామ్లో ఉన్నారు:
'గ్రూప్ స్టేజ్లో అన్ని మ్యాచ్లు గెలవడానికి జట్టు సమష్టి ప్రదర్శనే కారణం. ప్రతీ ఒక్కరూ మంచి ఫామ్లో ఉన్నారు. షెఫాలీ వర్మ, స్మృతీ మంధానాలు మంచి ఆరంభాన్ని ఇస్తున్నారు. టీ20 ఫార్మాట్లో ఓపెనింగ్ చాలా కీలకం. ఒకసారి ఒత్తిడిలో పడ్డామంటే.. తిరిగి మ్యాచ్లోకి రావడం కష్టం. నెట్స్లో కూడా సానుకూల ధోరణితోనే ప్రాక్టీస్ చేస్తున్నాం. నేను, మంధానాలు ఇంకా గాడిలో పడాల్సి ఉంది. ఇది భారత మహిళలకు తొలి ఫైనల్. అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాం. ప్రపంచకప్ గెలవడానికి కృషి చేస్తాం' అని హర్మన్ ప్రీత్ చెప్పుకొచ్చారు.
రెండో సెమీస్కి కూడా వరుణుడు అడ్డు:
గ్రూపు లీగులో అన్ని మ్యాచ్లు గెలిచి 8 పాయింట్లతో భారత్ టాప్లో ఉండగా.. ఇంగ్లండ్ చేతిలో ఆరు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో భారత్ నేరుగా ఫైనల్కి చేరింది. ఇప్పటికే ప్రారంభం కానున్న రెండో సెమీస్కి కూడా వరుణుడు అడ్డుపడ్డాడు. ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఆస్ట్రేలియా (6) కంటే దక్షిణాఫ్రికా (7)కే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ప్రొటీస్ నేరుగా ఫైనల్స్కి చేరుతుంది. ఈ క్రమంలో మార్చి 8న జరగనున్న ఫైనల్లో భారత్, దక్షిణాఫ్రికాలు తలపడనున్నాయి.