రనౌట్: జడేజా బుల్లెట్ త్రోని ధోని వికెట్లపైకి మళ్లించాడిలా! (వీడియో)


హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని వికెట్ల వెనుక ఎంత చురుగ్గా వ్యవహరిస్తుంటాడో మనందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అంగీకరించింది. ధోని వికెట్ల వెనుక ఉన్నప్పుడు ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్మెన్ అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించింది.
ప్రత్యర్థి బ్యాట్స్మెన్ కదలికల్ని క్షణాల్లో పసిగట్టే ధోని సమయస్ఫూర్తితో ఎన్నోసార్లు ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్మెన్ను రనౌట్లు చేశాడు. తాజాగా ఆస్ట్రేలియాతో రాంచీ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలోనూ ధోని అలాంటి రనౌటే చేశాడు. జడేజా విసిరిన బుల్లెట్ త్రోని రెప్పపాటులో వికెట్లపైకి మళ్లించిన ధోని, ఆసీస్ హిట్టర్ మాక్స్వెల్ను పెవిలియన్కు చేర్చాడు.
కుల్దీప్ యాదవ్ ఓవర్లో
ఇన్నింగ్స్ 42వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో బంతిని మిడ్ వికెట్ దిశగా తరలించిన షాన్ మార్ష్ పరుగు కోసం నాన్స్టైక్ ఎండ్లో ఉన్న మాక్స్వెల్ (31)ని పిలిచాడు. అదే సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర జడేజా బంతిని వేగంగా అందుకునే క్రమంలో తొలుత తడబడ్డాడు. దీంతో ఇదే అదనుగా భావించిన మాక్స్వెల్ పరుగుని పూర్తి చేసేందుకు ప్రయత్నించాడు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
అయితే, బంతిని అందుకున్న జడేజా బుల్లెట్ని తలపిస్తూ ధోని చేతికి బంతిని అందించగా ధోని ఏ మాత్రం తడబడకుండా అంతేవేగంతో బంతిని వికెట్లపైకి మళ్లించేశాడు. ఇంకేముంది మాక్స్వెల్ రనౌటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీమిండియాకు భారీ విజయ లక్ష్యం
కాగా, మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆతిథ్య జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు ఆరోన్ ఫించ్(93), ఉస్మాన్ ఖవాజ(104) సెంచరీతో చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 313 పరుగులు చేసింది. ఆసీస్ హిట్టర్ మాక్స్వెల్(47: 31 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, మహ్మద్ షమీ ఒక వికెట్ తీశారు.
ఆసీస్ ఓపెనర్లు ఇద్దరూ
గత కొంతకాలంగా ఫామ్లేమితో ఇబ్బందిపడుతున్న ఆసీస్ ఓపెనర్లు ఇద్దరూ రాంచి వన్డేలో రాణించారు. కేదార్ జాదవ్ వేసిన 17వ ఓవర్లో రెండు సిక్సర్లు, ఫోర్ బాది 19 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో వన్డేల్లో ఫించ్ 19వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే షమీ వేసిన 19వ ఓవర్లో ఖవాజా కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. సెంచరీకి చేరువగా వచ్చిన ఆరోన్ ఫించ్ను 32వ ఓవర్లో కుల్దీప్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో తొలి వికెట్కి 193 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

వన్డేల్లో తొలి సెంచరీ నమోదు చేసిన ఖవాజా
ఆ తర్వాత ఖవాజా వన్డేల్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫించ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మాక్స్వెల్ దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. అయితే సెంచరీ సాధించిన కొంత సమయానికే ఖవాజా(104) షమీ బౌలింగ్లో బుమ్రాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం మ్యాక్స్వెల్(47) అనవసర పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ దూకుడు చూస్తే 330కు పైగా స్కోరు చేసేలా కనిపించారు. అయితే చివర్లో ఆ జట్టు బ్యాట్స్మెన్ తడబడ్డారు. మిడిలార్డర్ బ్యాట్స్మెన్ క్రీజులో కుదురుకోకుండా కోహ్లీ చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి.

చివరి 10 ఓవర్లలో పరుగులు రాకుండా
ఆసీస్కు ఓపెనర్లు అదిరే ఆరంభం ఇచ్చినా.. చివరి 10 ఓవర్లలో పరుగులు రాకుండా భారత బౌలర్లు విజయవంతమయ్యారు. ఇక కుల్దీప్ వేసిన 44వ ఓవర్లో షాన్ మార్ష్(7), హాండ్స్కోండ్(0) ఔట్ అయ్యారు. ఈ ఓవర్లో రెండో బంతికి షాన్ మార్ష్(7).. విజయ్ శంకర్కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించగా నాలుగో బంతికి హాండ్స్కాంబ్(0)ను ఎల్బీగా పెవిలియన్కు చేరాడు. చివర్లో స్టోయినిస్ (31 నాటౌట్), అలెక్స్ కేరీ(21 నాటౌట్) రాణించడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 313 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications