
హైదరాబాద్: మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో డీఆర్ఎస్ వివాదం వెలుగులోకి వచ్చింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో భాగంగా మిచెల్ సాంట్నర్ ఔట్కు సంబంధించి మైదానంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
అసలేం జరిగింది?
ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన ఒక బంతి శాంట్నర్ గ్లౌజ్కున్న మణికట్టు బ్యాండ్కు తగిలి గాల్లోకి లేచింది. అదే సమయంలో గల్లీలో ఫీల్డింగ్ చేస్తోన్న ఫీల్డర్ దానిని క్యాచ్గా ఒడిసి పట్టుకున్నాడు. అయితే అది ఔట్ కాదంటూ ఫీల్డ్ అంపైర్ ఎరాస్మస్ ప్రకటించాడు. దీంతో ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ డీఆర్ఎస్కు వెళ్లాడు.
థర్డ్ అంపైర్గా ఉన్న అలీమ్ దార్ సైతం ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే కట్టుబట్టాడు. ఫలితంగా సాంట్నర్ నాటౌట్గా బతికిపోయాడు. అయితే, హాట్స్పాట్లో పదే పదే పర్యవేక్షించగా బంతి మాత్రం మణికట్టుకున్న బ్యాండ్ను తాకింది. దీనిని సరిగా థర్డ్ అంపైర్ గమనించకపోవడంతో డీఆర్ఎస్పై ఆసీస్ క్రికెటర్లు మండిపడుతున్నారు.
థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ప్రకటించలేనప్పుడు ఈ డీఆర్ఎస్ విధానం ఉండి ప్రయోజనం ఏముంటుందని ఆస్ట్రేలియా బ్యాటింగ్ కోచ్ రికీ పాంటింగ్ ప్రశ్నించాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్ను సవాల్ చేసినప్పుడు థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ప్రకటించాలి కదా? అంటూ లంచ్ విరామంలో ఆసీస్ పేసర్ జేమ్స్ ప్యాటిన్సన్ సైతం తన అసంతృప్తిని వెళ్లగక్కాడు.
గురువారం ప్రారంభమైన ఈ బాక్సింగ్ డే టెస్టులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 467 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 148 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఆసీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 45 ఓవర్లకు గాను 137/4 స్థితిలో నిలిచింది.