|
ఐదో టెస్టు తొలిరోజు మ్యాచ్కు హాజరైన మాల్యా
గతేడాది ఇంగ్లాండ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరిగిన సమయంలో టీమిండియా ఆడిన అన్ని మ్యాచ్లకు మాల్యా హాజరైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోహ్లీ సేన ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్లో పర్యటిస్తోంది. ఇరు జట్ల మధ్య ఆగస్టు 1న తొలి టెస్టుకి ముందు కోహ్లీసేనను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని మాల్యా కోరిన సంగతి తెలిసిందే.
ఓపెనర్ అలెస్టర్ కుక్కు ఇది చివరి టెస్టు
అయితే, అందుకు అటు బోర్డుతో పాటు ఇటు ప్రభుత్వం కూడా తిరస్కరించింది. దీంతో విజయ్ మాల్యాకు టీమిండియాను కలిసే అవకాశం లభించలేదు. ఈ నేపథ్యంలో మాల్యా ఓవల్ వేదికగా ఇరు జట్ల మధ్య జరుగుతోన్న ఐదో టెస్టు తొలి రోజు మ్యాచ్కు హాజరయ్యాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ అలెస్టర్ కుక్కు ఇది చివరి టెస్టు.
|
పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులు
దీంతో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్కి పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ను టీమిండియా ఇప్పటికే 1-3తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో చివరి టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.
ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు
తొలి రెండు సెషన్లలోనూ నిరాశపరిచిన భారత బౌలర్లు మూడో సెషన్లో విజృంభించి ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టారు. కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న ఓపెనర్ అలిస్టర్ కుక్ (71), మొయిన్ అలీ (50) అర్ధ శతకాలతో రాణించగా శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 90 ఓవర్లలో 7 వికెట్లకు 198 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బట్లర్ (11 బ్యాటింగ్), రషీద్ (4 బ్యాటింగ్) పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ మూడు, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు.