
హైదరాబాద్: మైదానం నుంచి తమ బ్యాట్స్మన్లను వచ్చేయమనలేదని, అంపైర్లు పొరపాటు చేశారు కాబట్టే అలా మాట్లాడానని బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ఉల్ హాసన్ పేర్కొన్నాడు. నిదాహాస్ ముక్కోణపు టీ20 సిరిస్లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో నోబాల్ వివాదంతో పాటు ఇరు జట్లకు చెందిన ఆటాగళ్ల మధ్య ఆగ్రహావేశాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లు మైదానంలోని అంఫైర్లతో గొడవకు సైతం దిగారు. ఈ వ్యవహారంపై మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ఉల్ హాసన్ మీడియాతో మాట్లాడారు.
'(ఉదాన వేసిన) 20వ ఓవర్లో తొలి బంతి.. ముస్తాఫిజుర్ భుజాల భుజం కంటే ఎత్తులో వెళ్లడంతో స్వేర్లెగ్ అపైర్ 'నో బాల్' ప్రకటించారు. కానీ మరుక్షణంలోనే ప్రధాన అపైర్తో మాట్లాడి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రెండో బంతి కూడా అంతే ఎత్తులో బౌన్స్ అయింది. కానీ అంపైర్లు నోబాల్ ఇవ్వలేదు' అని పేర్కొన్నాడు.
'ఆటలో పొరపాట్లు సహజం. ఆ పొరపాటు గురించే అంపైర్లతో మాట్లాడానుగానీ మరో ఉద్దేశం లేదని అన్నాడు. బంగ్లా బ్యాట్స్మెన్లను మైదానం నుంచి బయటకు వచ్చేయమని చెప్పలేదు. ఆట కొనసాగించమని చెప్పాను. నా సైగలను తప్పుగా అర్థం చేసుకున్నారు. అసలు నేనేం చెప్పానో మీకు(మీడియాకు) ఎలా తెలుస్తుంది? ప్రస్తుతం మా దృష్టంతా భారత్తో జరిగే ఫైనల్ మ్యాచ్పైనే' అని షకీబ్ అన్నాడు.
మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ ఆటగాళ్లు నాగిని డ్యాన్స్ చేస్తూ శ్రీలంక ఆటగాళ్లను గేలి చేయడంపై షకీబ్ స్పందించాడు. 'లంకతో జరిగిన మ్యాచ్లో ఆటగాళ్ల భావోద్వేగాలు శృతిమించాయన్నది వాస్తవం. గీత దాటి ప్రవర్తించానా? అని నాకు కూడా అనిపించింది. నన్ను నేను తమాయించుకోవడం అవసరమనిపించింది. ఆటలో ఇలాంటి ఉద్వేగాలు సహజమే' అని పేర్కొన్నాడు.
శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఆతిథ్య శ్రీలంకపై బంగ్లాదేశ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించి పైనల్కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ అనంతరం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్ క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు ధ్వంసమయ్యాయి.
డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు ధ్వంసం ఘటనపై ప్రేమదాస స్టేడియం సిబ్బంది శ్రీలంక బోర్డుకు ఫిర్యాదుచేశారు. దీంతో బోర్డు అధికారులు విచారణకు ఆదేశించారు. మ్యాచ్ చివరి ఓవర్లో బంగ్లాదేశ్-శ్రీలంక ప్లేయర్లు పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఒకానొక దశలో మ్యాచ్ నిలిచిపోతుందేమో అనిపించేలా బంగ్లాదేశ్ జట్టు క్రికెటర్లు వ్యవహరించారు. అయితే.. ఎట్టకేలకి ఆ జట్టు కోచ్, అంపైర్లు చొరవ తీసుకుని ఆటగాళ్లని శాంతపరచడంతో.. మ్యాచ్ కొనసాగింది.