
హైదరాబాద్: దేశవాళీ క్రికెట్లో వసీం జాఫర్ తన సక్సెస్ను కొనసాగిస్తున్నాడు. తాజాగా ఇరానీ కప్లో 40 ఏళ్ల వసీం జాఫర్ సెంచరీ సాధించి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. వసీం జాఫర్కు ఇది 53వ సెంచరీ కావడం విశేషం. అంతేకాదు తన ఖాతాలో రెండు రికార్డులు కూడా వేసుకున్నాడు.
ఇరానీ కప్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేయడంతో పాటు ఇరానీ కప్లో వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు నమోదు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. మాజీ క్రికెటర్ గుండప్ప విశ్వనాథ్ మాత్రమే ఇప్పటి వరకు ఇరానీ కప్లో వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్.
ఇప్పుడు ఆ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా వసీం జాఫర్ నిలిచాడు. నాగ్ పూర్లోని వీసీఏ స్టేడియంలో జరుగుతోన్న ఈ ఇరానీ కప్లో వసీం జాఫర్ విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రెండో రోజు కూడా వసీం జాఫర్ తన జోరుని కొనసాగిస్తున్నాడు. బుధవారం తొలి రోజు ఆటలో 53 సెంచరీ సాధించిన జాఫర్ గురువారం దానిని డబుల్ సెంచరీగా మలుచుకున్నాడు. దీంతో 250కి పైగా పరుగులు సాధించిన తొలి ఆసియా క్రికెటర్గా జాఫర్ గుర్తింపు సాధించాడు.
అంతకముందు తొలిరోజు ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విదర్భకు కెప్టెన్ ఫజల్ (89), సంజయ్ రామస్వామి (53) చక్కటి శుభారంభాన్నిచ్చారు.
తొలి వికెట్కు వీరిద్దరూ 101 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. సంజయ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జాఫర్.. ఫజల్తో కలిసి రెండో వికెట్కు 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో అశ్విన్, జయంత్కు చెరో వికెట్ దక్కింది.