క్రీస్ట్ చర్చ్ వేదికగా కివీస్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాటింగ్ లైనప్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (51) ఆడకపోయి ఉంటే కనీసం పోరాడగలిగే స్కోరు కూడా చెయ్యలేకపోయేంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు శిఖర్ ధావన్ (28), శుభ్మన్ గిల్ (13) ఇద్దరూ తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ (10), సూర్యకుమార్ యాదవ్ (5) ఇద్దరూ మరోసారి విఫలమయ్యారు.
ఇలాంటి సమయంలో శ్రేయాస్ అయ్యర్ (49) మరోసారి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. లోకీ ఫెర్గూసన్ బౌలింగ్లో హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా కూడా ఆకట్టుకోలేదు. టిమ్ సౌథీ బౌలింగ్లో తక్కువ స్కోరు వద్దనే అవుటయ్యాడు. దీపక్ చాహర్ కూడా డారియల్ మిచెల్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు.
అవతలి ఎండ్లో కనీసం సహకారం అందించే బ్యాటర్ కూడా లేకపోయినా వాషింగ్టన్ సుందర్ (51) మొక్కవోని ధైర్యం చూపాడు. కివీ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. దీపక్ చాహర్ (12), యుజ్వేంద్ర చాహల్ (8), అర్షదీప్ సింగ్ (9), ఉమ్రాన్ మాలిక్ (0 నాటౌట్) అండగా చెలరేగాడు. ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు.
ఈ క్రమంలోనే టిమ్ సౌథీ వేసిన 48వ ఓవర్ తొలి బంతికి సిక్సర్ బాదాడు. దీంతో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే అదే ఓవర్ మూడో బంతికి అవుటయ్యాడు. సౌథీ వేసిన షార్ట్ బాల్ను సరిగా ఆడలేకపోయాడు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ టామ్ లాథమ్ అందుకోవడంతో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. భారత జట్టు 47.3 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌట్ అయింది. కివీ బౌలర్లలో ఆడమ్ మిల్నే, డారియల్ మిచెల్ చెరో మూడు వికెట్లతో సత్తా చాటారు. టిమ్ సౌథీ 2, ఫెర్గూసన్, శాంట్నర్ చెరో వికెట్ తీసుకున్నారు.