హైదరాబాద్: డర్బన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్లు ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినట్లు మ్యాచ్ అంఫైర్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి నివేదించారు. ఈ నివేదికలో డేవిడ్ వార్నర్ లెవెల్ 2 నేరానికి పాల్పడగా... డీకాక్ లెవెల్ 1 నేరానికి పాల్పడినట్లు వారు పేర్కొన్నారు.
దీంతో వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్పై ఒక్క మ్యాచ్ నిషేధం పడనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తొలి టెస్టులో డేవిడ్ వార్నర్- డికాక్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వీడియో ఫుటేజీలో సహచర క్రికెటర్లు వార్నర్... డికాక్పైకి దూసుకెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది.
దీంతో ఐసీసీ విచారణలో 'గేమ్ ఆఫ్ డిస్ప్యూట్' కింద వార్నర్ ఐసీసీ లెవల్-2 నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. ఐసీసీ ఇదే చెబితే అతని ఖాతాలో నాలుగు డీమెరిట్ పాయింట్లు చేరతాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ ఆటగాడి ఖాతాలో నాలుగు డీమెరిట్ పాయింట్లు ఉంటే అతడిపై ఒక టెస్టు మ్యాచ్ నిషేధం విధిస్తారు.
దీంతో పాటు మ్యాచ్ ఫీజులో 100శాతం కోత విధిస్తారు. దీని ప్రకారం వార్నర్ ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరగబోయే రెండో టెస్టులో ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. అంఫైర్లు ఇచ్చిన నివేదికపై ఐసీసీ స్పందించింది. డ్రెస్సింగ్ రూమ్ వద్ద వార్నర్, డీకాక్లు మాటల యుద్ధానికి దిగడాన్ని ఐసీసీ తీవ్రంగా పరిగణించింది.
మీ ప్రవర్తనతో గేమ్కు అప్రతిష్టను తీసుకువచ్చారని, వారిపై వచ్చిన ఆరోపణలపై ఇరు జట్లు స్పందించాలని బుధవారం (మార్చి 7) సాయంత్రం వరకు గడువు ఇచ్చింది. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం వార్నర్ తదుపరి టెస్టులో ఆడాలని, జట్టులో అతడెంతో కీలక ఆటగాడని చెబుతోంది.
మరోవైపు వార్నర్తో వాగ్వాదంలో ఉన్న డికాక్ ఐసీసీ లెవల్-1 నిబంధనలు ఉల్లంఘించినట్లు మాత్రమే తెలుస్తోంది. ఇదే జరిగితే అతని ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్లతో పాటు మ్యాచ్ ఫీజులో కొంత మేర కోత పడుతోంది. మార్చి 9 నుంచి పోర్ట్ ఎలిజబెత్లో ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది.
వార్నర్-డీకాక్ వివాదం: వార్న్ నుంచి వాన్ వరకు ఎవరేమన్నారు
ఇరు జట్లు స్పందించిన తర్వాత వార్నర్, డీకాక్లపై ఐసీసీ ఓ నిర్ణయం తీసుకోనుంది. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య డర్బన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో నాలుగో రోజైన ఆదివారం మైదానంలో ఏం జరిగిందో తెలియదు గానీ, టీ విరామ సమయంలో వీరిద్దరూ డ్రెస్పింగ్ రూమ్కి వెళ్లేటప్పుడు మెట్ల వద్ద తీవ్ర వాగ్వాదానికి దిగారు.
సహచర ఆటగాళ్లు వద్దు వద్దు అని వారిస్తున్నా వార్నర్ దూకుడు ప్రదర్శించాడు. దీనికి డికాక్ కూడా దీటుగానే సమాధానం ఇచ్చాడు. అయితే, సహచరులు టిమ్ పైన్, ఖవాజా, ఓ అధికారి వారిస్తున్నా వినకుండా వార్నర్.. క్వింటన్ను కొట్టేందుకు దూసుకెళ్లాడు. ఈ గొడవ ఎక్కువవడంతో సఫారీ డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ బయటకు వచ్చాడు.
ఆ తర్వాత కాసేపటికి కెప్టెన్ స్మిత్ వచ్చి వార్నర్ను డ్రస్సింగ్ రూమ్లోకి తీసుకువెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మొత్తం కింగ్స్ మీడ్ స్టేడియంలో మెట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియోను స్థానిక మీడియా బయటపెట్టడంతో ఇప్పుడు చర్చనీయాంశమైంది.
దీంతో ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి క్రికెట్ ఆస్ట్రేలియా విచారణకు ఆదేశించింది. గొడవ ఎలా మొదలైందో అనే విషయంపై విచారణ చేస్తున్నామని, నిజానిజాలు తెలిసేవరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోబోమని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారి ఒకరు తెలిపారు. ఆటగాళ్ల మధ్య గొడవలు క్రికెట్కు మంచివి కాదని ఇప్పటికే ఇరు జట్లకు చెందిన పలువురు మాజీ క్రికెటర్లు హితవు పలికారు.