ఆటగాడి సామర్థ్యంనే ఫ్రాంఛైజీ చూస్తుంది:
తాజాగా వీవీఎస్ లక్ష్మణ్ స్టార్ స్పోర్ట్స్ 'క్రికెట్ కనెక్టెడ్' షోలో మాట్లాడుతూ... 'ఎవరితోనో మంచిగా ఉన్నంత మాత్రాన ఐపీఎల్ టోర్నీలో చోటు దక్కదు. జట్టులోకి తీసుకోవడానికి ఏ ఫ్రాంఛైజీ అయినా ఆటగాడి సామర్థ్యం, అతడు జట్టుకు ఎంత విలువను చేకూరుస్తాడన్నది చూస్తుంది. మ్యాచ్లు గెలిపిస్తారనుకునే ఆటగాళ్ల వైపే ఫ్రాంఛైజీ మొగ్గు చూపుతుంది. అలాంటి ఆటగాళ్లకే ఐపీఎల్ కాంట్రాక్టులు దక్కుతాయి. అంతే కానీ.. ఎవరితోనో మంచిగా ఉంటే కాంట్రాక్టులు రావు' అని అన్నాడు.
కోహ్లీతో మంచిగా ఉంటే కాంట్రాక్టు దక్కదు:
'ఏ భారత ఆటగాడితోనైనా ఓ విదేశీ ప్లేయర్ స్నేహంగా ఉన్నాడంటే.. దానర్థం అతడికి ఐపీఎల్ కాంట్రాక్టు వస్తుందని కాదు. ఇది మనం ఆలోచించే విధానంలో ఉంటుంది. మార్గనిర్దేశకుడిగా నేను ఐపీఎల్ వేలంలో పాల్గొన్నా. తమ తమ దేశాల తరఫున బాగా ఆడిన విదేశీ ఆటగాళ్లనే మేం ఎంపిక చేశాం. అంతేకాని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో మంచిగా ఉన్నాడని ఎంపిక చేయలేదు. కోహ్లీతో మంచిగా ఉన్నంత మాత్రాన ఐపీఎల్ కాంట్రాక్టు దక్కదు' అని లక్ష్మణ్ క్లార్క్పై మండిపడ్డాడు. సన్రైజర్స్ హైదరాబాద్కు లక్ష్మణ్ మార్గనిర్దేశకుడిగా ఉన్న విషయం తెలిసిందే.
హాస్యాస్పదంగా అనిపించాయి:
భారత మాజీ ఓపెనర్ క్రిస్ శ్రీకాంత్ కూడా క్లార్క్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టాడు. అవి హాస్యాస్పదంగా అనిపించాయని పేర్కొన్నాడు. 'కేవలం మీరు స్లెడ్జింగ్ చేయడం ద్వారా మ్యాచ్లను గెలవరు. ఇది ఆస్ట్రేలియాకే నష్టం. క్లార్క్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. నా అభిప్రాయం ప్రకారం స్లెడ్జింగ్ ఏ విధంగానూ సహాయపడదు. వికెట్లు తీయడానికి బాగా బౌలింగ్ చేయాలి, లక్ష్యాలను సాధించడానికి బాగా బ్యాటింగ్ చేయాలి' అని 60 ఏళ్ల శ్రీకాంత్ అన్నాడు.
క్లార్క్ ఆరోపణలను ఖండించిన పైన్:
ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ ఐపీఎల్ కాంట్రాక్టులను కాపాడుకునేందుకు ఓ దశలో భారత కెప్టెన్ కోహ్లీని స్లెడ్జింగ్ చేయడానికి భయపడ్డారని ఇటీవల క్లార్క్ వ్యాఖ్యానించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా కెప్టెన్ పైన్ ఈ ఆరోపణలను ఖండించాడు. టీమిండియా-ఆసీస్ టూర్లో కోహ్లీని రెచ్చగొట్టకూడదనే వ్యూహంలో భాగంగానే ఆ విధంగా వ్యవహరించినట్టు పైన్ తెలిపాడు. ఒకవేళ రెచ్చిగొట్టినప్పుడు కోహ్లీ తన అత్యుత్తమ క్రికెట్ ఆడతాడన్నది మా ఉద్దేశం, ఇంతకంటే వేరే ఆలోచన మాకు లేదని పైన్ వివరణ ఇచ్చాడు.