హైదరాబాద్: హెచ్సీఏ అధ్యక్ష, కార్యదర్శి ఎన్నిక చెల్లదని అంబుడ్స్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఈనెల 8న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ జి. వివేకానంద్, శేష్ నారాయణ్లు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. వీరు దాఖలు చేసిన పిటిషన్లు బుధవారం విచారణకు వచ్చాయి.
హెచ్సీఏలో ఊహించని పరిణామం: అధ్యక్షునిగా వివేక్ అనర్హుడు
తాను పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నట్లు గుర్తిస్తే, ఎథిక్స్ అధికారిగా అంబుడ్స్మన్.. వాటిని సరిదిద్దుకునే మార్గదర్శకాలు సూచించి ఉండాల్సిందని వివేక్ తన పిటీషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాననే విషయం అంబుడ్స్మెన్ పరిధిలోకి రాదని, అది అపెక్స్ కౌన్సిల్ పరిధిలోని వస్తుందని తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఇక, ఏసీబీ అభియోగపత్రంలో పేరు ఉందన్న కారణంగా తనను అనర్హుడిగా పేర్కొనడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని శేష్ నారాయణ్ పేర్కొన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని తమను అనర్హులుగా పేర్కొంటూ అంబుడ్స్మన్ మార్చి 8న జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరారు.
అయితే, ఈ విచారణను గురువారానికి వాయిదా వేయాలని న్యాయవాదులు అభ్యర్థించగా న్యాయమూర్తి అనుమతించారు.
అసలేం జరిగింది?
వివేక్, శేష్నారాయణలకు వ్యతిరేకంగా మాజీ క్రికెటర్ అజహరుద్దీన్, మాజీ ఎంపీ వీహెచ్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన అంబుడ్స్మన్.. హెచ్సీఏతో వ్యాపార ఒప్పందాలున్న విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు వివేకానంద్ డైరెక్టర్గా వ్యవహరించడం.. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకి వస్తుందని అంబుడ్స్మన్ తన తీర్పులో పేర్కొన్నారు.
వివేకానంద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారని కూడా అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆ కారణాలతో హెచ్సీఏ అధ్యక్షుడిగా వివేకానంద్ కొనసాగడానికి అనర్హుడని పేర్కొన్నారు. హెచ్సీఏకు సంబంధించిన అవినీతి కేసుల్లో దాఖలైన అభియోగ పత్రాల్లో శేష్నారాయణ్ పేరు ఉన్నందున కార్యదర్శిగా కొనసాగడానికి వీల్లేదని అంబుడ్స్మన్ ఆదేశాలిచ్చారు.
అంతవరకు హెచ్సీఏ తాత్కాలిక అధ్యక్ష, కార్యదర్శులుగా ఉపాధ్యక్షుడు, కోశాధికారి వ్యవహరిస్తారని చెప్పారు. వీరిద్దరూ ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదంటూ స్పష్టం చేశారు.