విండిస్తో సిరిస్లో ఓపెనర్గా రిషబ్ పంత్!: ప్రెస్ మీట్లో కోహ్లీ ఏమన్నాడంటే!

హైదరాబాద్: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ను ఒంటరిగా వదిలేయాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులను కోరాడు. వరల్డ్కప్ తర్వాత మహేంద్ర సింగ్ ధోని క్రికెట్కు విశ్రాంతి ప్రకటించడంతో మూడు ఫార్మాట్లలో జట్టు సెలక్టర్లు ప్రధాన వికెట్ కీపర్గా రిషబ్ పంత్ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
అయితే, ఈ మధ్య కాలంలో రిషబ్ పంత్ తన పేలవ ఫామ్తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవలే దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్తో ముగిసిన టెస్టు సిరిస్లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇక, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో కూడా పంత్ నిరాశపరచడంతో అతడి స్థానంలో సంజు శాంసన్కు అవకాశం ఇవ్వాలని మాజీలు అంటున్నారు.
అయితే, రిషబ్ పంత్ సామర్థ్యాలపై నమ్మకం ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. మూడు టీ20ల సిరిస్లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య తొలి టీ20 నగరంలోని ఉప్పల్ స్టేడియంలో శక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.

రిషబ్ పంత్ను ఓపెనర్గా బరిలోకి
ఈ సందర్భంగా విండిస్తో జరిగే టీ20 సిరిస్లో రిషబ్ పంత్ను ఓపెనర్గా బరిలోకి దింపబోతున్నారా? అని ఒక విలేకరి అడిగినప్పుడు... విరాట్ కోహ్లీ ప్రతికూలంగానే సమాధానం ఇవ్వడం విశేషం. కోహ్లీ మాట్లాడుతూ "నిజంగా కాదు (పంత్ ఓపెనింగ్పై). ఎందుకంటే ప్రస్తుతం జట్టులోని బ్యాట్స్మన్ ఏ స్థానంలోనైనా ఆడగలరు. ఉదాహరణకు వృద్దిమాన్ సాహాను తీసుకుంటే.. ఐపీఎల్లో అన్ని స్థానాల్లో బ్యాటింగ్కు దిగాడు. కోల్కతా టెస్టుకు ముందు సాహాతో అదే చెప్పా. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్కు రెడీగా ఉండమని చెప్పా. ఇక వెస్టిండీస్ సిరీస్కు టీమిండియా పూర్తిగా సిద్దమైంది. పొట్టి ఫార్మట్లో ఏ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు" అని అన్నాడు.

పంత్ను ఒంటరిగా వదిలేయండి
"పంత్ సామర్థ్యాన్ని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. ఆటగాడిగా అతడు రాణించడానికి కొంత స్పేస్ ఇవ్వడం... చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి సమిష్టి బాధ్యత అని నేను అనుకుంటున్నాను. అతడు విఫలమైన సందర్భంలో మనం అండగా నిలవాల్సి ఉంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో పంత్ విపలమై మైదానం వీడుతుంటే అభిమానులు ధోని అని అరవడం ముందుగా ఆపేయాలి. ఇది సరైన పద్దతి కాదు. దేశం కోసం ఆడే ప్రతీ క్రికెటర్ ఎంతో నిబద్దత, క్రమశిక్షణతో ఆడతాడు. ఎప్పుడూ మంచిగా ఆడాలి, దేశానికి విజయాలు అందించాలని ఆలోచిస్తూనే ఉంటాడు. ఏ ఒక్క ఆటగాడు కావాలని అలాంటి పరిస్థితి తెచ్చుకోడు. ఇలాంటి సందర్భంలో అతడికి మద్దతుగా నిలవాలి. " అని కోహ్లీ తెలిపాడు.

పంత్ తప్పు చేస్తాడని
"సొంతదేశంలో ఆడుతున్నప్పుడు పంత్ తప్పు చేస్తాడని ఎప్పుడూ ఆలోచించకుండా అతడికి మద్దతు ఇవ్వాలి. ఈ విషయాన్ని ఇప్పటికే రోహిత్ శర్మ ఎత్తి చూపాడు. అతడిని ఒంటరిగా వదిలేయాలని. అతడు మ్యాచ్ విన్నర్. ఫామ్లోకి వచ్చాడంటే ఐపీఎల్లో చూసిన పంత్ను మళ్లీ చూస్తాం" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్లో అతడు స్వేచ్ఛగా
"ఐపీఎల్లో అతడు స్వేచ్ఛగా ఆడగలుగుతాడు. అతడు తన చుట్టపక్కల పరిసరాలను అనుభూతిని చెందాల్సిన అవసరం ఉంది. మనమందరం కూడా అతడు సౌకర్యవంతంగా ఉండేలా చేయాలి. మనమంతా పంత్కు వ్యతిరేకంగా కాకుండా అతని కోసం ఉన్నామని తెలియజేయాలి" అని కోహ్లీ వెల్లడించాడు.
తొలి టీ20 హైదరాబాద్లో
భారత పర్యటనలో భాగంగా వెస్టిండిస్ జట్టు 3 టీ20లు, 3 వన్డేల సిరిస్ ఆడనుంది. ఇందులో భాగంగా తొలి టీ20కి హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. డిసెంబర్ 8న జరిగే రెండో టీ20కి తిరువనంతపురం ఆతిథ్యమిస్తుండగా... డిసెంబర్ 11న జరిగే మూడో టీ20కి ముంబై ఆతిథ్యమివ్వనుంది.

టీ20 జట్ల వివరాలు:
భారతదేశం: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, వాషింగ్టన్ సుందర్, శివం దుబే, రవీంద్ర జడేజా, సంజు సామ్సన్, లోకేష్ రాహుల్, రిషబ్ పంత్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్, మహ్మద్ షమ్మీ
వెస్టిండీస్: పొలార్డ్ (కెప్టెన్), ఫాబియన్ అలెన్, షెల్డన్ కాట్రెల్, షిమ్రాన్ హెట్మీర్, జాసన్ హోల్డర్, కీమో పాల్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, ఖారీ పియరీ, నికోలస్ పూరన్, డెనేష్ రామ్దిన్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, లెండ్ల్ సిమన్స్, కెసెరిక్ విలియమ్స్, వాల్ష్ జూనియర్
మ్యాచ్ ప్రారంభం: శుక్రవారం రాత్రి 7 గంటలకు
ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్లో
ఆన్ లైన్: హాట్ స్టార్లో
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications