కోహ్లీ ఇంటికి శ్రేయస్:
లాక్డౌన్ కారణంగా సినిమాల షూటింగులూ జరగడం లేదు. దీంతో ఈ విలువైన సమయాన్ని విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. టీమిండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ సైతం ముంబైలోని తన ఇంటికే పరిమితం అయ్యాడు. ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా తల్లిదండ్రులకు సాయం చేస్తున్నాడు. కోహ్లీ ఇంటికి 500 మీటర్ల దూరంలోనే శ్రేయస్ వాళ్లుంటారు. లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో అతడు కోహ్లీ ఇంటికి వెళ్లాడు.
దోసెలు తిని ఎంత కాలమైందో:
శ్రేయస్ అయ్యర్ వట్టి చేతులతో వెళ్లకుండా ఇంట్లో చేసిన దోసెలను విరాట్ కోహ్లీ కోసం తీసుకెళ్లాడు. దోసెలను తిన్న కోహ్లీ.. ఆ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 'మాకు 500 మీటర్ల దూరంలో ఉండే మంచి పొరుగింటి వ్యక్తి శ్రేయస్. అతడు నీర్ దోసెలు తెచ్చి మమ్మల్ని సంతోషపెట్టాడు. శ్రేయస్ అమ్మగారికి ధన్యవాదాలు. ఇలాంటి రుచికరమైన దోసెలు తిని ఎంత కాలమైందో. మేం పంపించిన పుట్టగొడుగుల బిర్యానీ నచ్చిందనే అనుకుంటున్నా శ్రేయాస్' అని కోహ్లీ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు.
కోహ్లీ భయ్యా ప్లీజ్ బిర్యానీ పంపించు:
విరాట్ కోహ్లీ పోస్ట్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన యుజువేంద్ర చాహల్ ఊరుకుంటాడా?. వెంటనే విరాట్ కోహ్లీని ఆటాట్టించాడు. 'విరాట్ భయ్యా.. ప్లీజ్ కొంత బిర్యానీ ఇక్కడకీ పంపించు. కేవలం 1400 కిలోమీటర్లు మాత్రమే' అంటూ నవ్వుతున్న ఎమోజీలు పెట్టేశాడు. చిలిపి ఆటగాడు చహల్కు కోహ్లీ ఏం రిప్లై ఇస్తాడో చూడాలి. ప్రస్తుతం చహల్ చేసిన ట్వీట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అభిమానులు కూడా తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
టీమిండియా కమెడియన్:
యుజ్వేంద్ర చహల్ ఎంత సరదా వ్యక్తో అందరికి తెలిసిందే. మైదానంలో అతను చేసే అల్లరి పనులే ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంటాయి. అతని చిలిపి చేష్టలకు ముగ్దుడైన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏకంగా చహల్ ఓ టీమిండియా కమెడియన్ అని బిరుదే ఇచ్చాడు. మాములుగానే కోతిపనులు చేసే చహల్కు లాక్డౌన్తో మరింత స్వేచ్చ దొరికింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ప్రతీ క్రికెటర్ను గెలుకుతూ.. వారితో చివాట్లు తింటూ.. మందలింపుకు గురవుతున్నాడు. ఎవరెన్నీ తిట్టినా ఏ మాత్రం పట్టించుకొని ఈ స్పిన్నర్.. తన పంథానైతే మార్చుకోవడం లేదు.
52 వన్డేలు, 42 టీ20లు:
యుజువేంద్ర చహల్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రయాణంలో తన కలలు నిజమయ్యాయని ఇటీవలే ఆనందం వ్యక్తం చేశాడు. 'ఆటను ఆస్వాదిస్తూ కలలు నిజం చేసుకున్నా.. ఈ ప్రయాణం ఎంతో అద్భుతం' అని పేర్కొన్నాడు. 29 ఏళ్ల స్పిన్నర్ ఇప్పటి వరకు భారత జట్టు తరఫున 52 వన్డేలు, 42 టీ20 మ్యాచులు ఆడి 146 వికెట్లు పడగొట్టాడు. భారత జట్టు చివరిగా మార్చిలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడగా ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.