హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలోని ఆఖరిదైన టెస్టు సిరీస్ను భారత్ పరాజయంతో ఆరంభించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కోహ్లీ తానొక్కడై జట్టును ఒంటిచేత్తో నడిపించినా చివరకు విజయానని రాబట్టేలేకపోయాడు. అయితే విమర్శకులంతా కోహ్లీని మినహాయించి టీమిండియాను చివాట్లు పెడుతుంటే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజిర్ హుస్సేన్ మాత్రం కోహ్లీ కూడా ఇందుకు బాధ్యత వహించాలని అంటున్నాడు.
అయిదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఎడ్జ్బాస్టన్లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లిష్ జట్టుపై భారత్ 31 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. రెండు ఇన్నింగ్స్ల్లోనూ విరాట్ కోహ్లి వీరోచిత పోరాటం చేసినా, కొద్దిలో మ్యాచ్ను చేజార్చుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ప్రదర్శనపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ ఓ టెలివిజన్ ఛానల్తో మాట్లాడిన ఆయన ఇలా స్పందించాడు.
'కోహ్లి అద్భుతంగా ఆడాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. టెయిలెండర్లతో కలిసి కోహ్లి చేసిన పోరాటం చూస్తే మ్యాచ్ గెలిచేందుకు భారత్కు అన్ని అర్హతలు ఉన్నాయి. ఒంటి చేత్తో మ్యాచ్ను భారత్వైపునకు తిప్పేలా ఆడాడు. అయితే, టీమ్ ఇండియా ఓటమిలో కొంత బాధ్యత కోహ్లి కూడా తీసుకోవాల్సి ఉంటుంది' అని అన్నాడు.
ఎందుకంటే.. 'ఇంగ్లాండ్ 87/7 పరుగులతో ఉండగా కరన్, అదిల్ రషీద్లు క్రీజులో ఉన్నారు. టీమ్ ఇండియా దాదాపు మ్యాచ్పై పట్టు సంపాదించింది. ఆ సమయంలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న రవిచంద్రన్ అశ్విన్ గంటపాటు భారత్కు అందుబాటులో లేడు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది. ఇలాంటి చిన్న విషయాలను సైతం కెప్టెన్గా అతను పక్కన పెట్టకూడదు' అని సూచించాడు. తొలి టెస్ట్లో కోహ్లి అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో 149 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్లో 51 పరుగులతో విజయం కోసం వీరోచితంగా పోరాడాడు.