నాయకుడంటే కోహ్లీనే:
'టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఆటగాళ్లను ప్రోత్సహించే కెప్టెన్. అందుకోసం ఏమైనా చేస్తాడు. నిజం చెప్పాలంటే నాయకుడికి అసలైన నిర్వచనం. అతడు నిజమైన నాయకుడు' అని ఇర్ఫాన్ పఠాన్ వివరించాడు. ఇర్ఫాన్ 2003లో టీమిండియాకు ఎంపికై.. ఆస్ట్రేలియాలో తొలి టెస్టు ఆడాడు. తర్వాత పాకిస్థాన్పై టెస్టుల్లో హ్యాట్రిక్ వికెట్లు తీసి ఒక్కసారిగా హీరో అయ్యాడు. బ్యాట్తోనూ పలు సందర్భాల్లో మంచి పరుగులు సాధించాడు. భారత్ తరఫున 29 టెస్టులాడిన ఇర్ఫాన్ 100 వికెట్లు తీశాడు. 120 వన్డేల్లో 173 వికెట్లు పడగొట్టాడు. ఇక 24 టీ20ల్లో 28 వికెట్లు తీశాడు. 2012లో చివరిసారి టీమిండియాకు ఆడిన ఇర్ఫాన్.. తర్వాత జమ్మూ కశ్మీర్ తరఫున దేశవాళీ క్రికెట్లో కొనసాగాడు. చివరకు ఈ ఏడాది జనవరిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
అనుభవంతో ధోనీ పరిపూర్ణ నాయకుడయ్యాడు:
అంతకుముందు మరో కార్యక్రమంలో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ గురించిన మాట్లాడిన ఇర్ఫాన్.. 2007కి, 2013కి అతడిలో చాలా మార్పులొచ్చాయన్నాడు. తన అనుభవంతో ఆ ఆరేళ్లలో చాలా నేర్చుకున్నాడని తెలిపాడు. 'టీమిండియాకు నాయకత్వం వహించే పెద్ద బాధ్యతను భూజానెత్తుకున్నప్పుడు ధోనీ ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. కెప్టెన్ అయిన తొలినాళ్లలో జట్టు సభ్యులను తన అదుపులో ఉంచుకోవాలనుకునేవాడు. ధోనీ సారథ్యంలో మీటింగ్ కేవలం 5 నిమిషాలే జరిగేది. 2007 నుంచి 2013 వరకు ఎప్పుడైనా అంతే. పరిణతి వస్తున్నా కొద్ది మహీ చాలా మారాడు. అయితే 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి అతడు బౌలర్లపై నమ్మకం ఉంచాడు. వాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి.. వారు స్వీయ నియంత్రణలో ఉండేలా చేశాడు. ఆరేళ్ల నాయకత్వంలో స్పిన్నర్లపై విశ్వాసం పెంచుకున్నాడు' అని మాజీ ఆల్రౌండర్ చెప్పాడు.
రోహిత్ విలువైన ఆటగాడు:
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఎంతో విలువైన ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదని మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. 'ఏ క్రికెటర్ అయినా ఎక్కువ సమయం తీసుకుంటున్నప్పుడు రోహిత్తో పోల్చితే కొంచెం రిలాక్స్గా ఉన్నట్లు కనబడతాడు. అప్పుడు అతను మరింత కష్టపడాలని చెబుతాం. కానీ రోహిత్లో పోరాడే తత్వం చాలా ఎక్కువ. అతను ఎప్పుడూ మనం మరింత కష్టపడాలని చెబుతూ ఉండేవాడు. జట్టు కోసం తొలి ప్రాధాన్యత ఇస్తాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా అతని ఘనతలు చూశాం. భారత జట్టులో రోహిత్ కీలక ఆటగాడు కావడానికి అతని పట్టుదలే కారణం. ముఖ్యంగా 2011 వన్డే ప్రపంచకప్లో అతనికి జట్టులో స్థానం కల్పించకపోవడమే మరింత శ్రమించేలా చేసింది' అని ఇర్ఫాన్ తెలిపాడు.
కోహ్లీ సారథ్యంలో ఆడలేదు:
ఇర్ఫాన్ పఠాన్ 2003లో సౌరవ్ గంగూలీ సారథ్యంలో భారత జట్టులోకి వచ్చాడు. ఈ క్రమంలోనే అతడు అనేక మంది కెప్టెన్లతో కలిసి ఆడాడు. 2006లో అతడి టీ20 అరంగేట్రం సెహ్వాగ్ సారథ్యంలో జరగ్గా.. 2007 వన్డే ప్రపంచకప్ ద్రవిడ్ నేతృత్వంలో.. అదే ఏడాది టీ20 ప్రపంచకప్ ధోనీ సారథ్యంలో ఆడాడు. చివరగా 2008లో అనిల్ కుంబ్లే సారథ్యంలోనూ టెస్టు క్రికెట్లో పాలుపంచుకున్నాడు. విరాట్ కోహ్లీ సారథ్యంలో మాత్రం ఆడలేకపోయాడు. ఐపీఎల్లోనూ ఎన్నో జట్ల తరఫున ఆడిన ఇర్ఫాన్.. ఆర్సీబీలో ఎప్పుడూ ఆడలేదు.