
ఆక్లాండ్: స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను టీమిండియా 2-1 తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఇక వరుస సిరీస్ విజయాలతో ఊపుమీదున్న టీమిండియా.. ఇక మూడు ఫార్మాట్లలోనూ న్యూజిలాండ్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడేందుకు మంగళవారం కివీస్ గడ్డపై అడుగుపెట్టింది. ఈ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు జరుగుతాయి. ఈ నెల 24న తొలి టీ20 మ్యాచ్తో పోరు మొదలవుతుంది. శుక్రవారం ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ వేదికగా తొలి టీ20 జరగనుంది.
చల్లని గాలులతో కూడిన వాతావరణానికి అలవాటు పడేందుకు కోహ్లీసేన ప్రయత్నిస్తోంది. మంగళవారం విశ్రాంతి తీసుకున్న ఆటగాళ్లు ఈ రోజు ప్రాక్టీస్, జిమ్ సెషన్లలో పాల్గొన్నారు. బుధవారం జిమ్ సెషన్లో కసరత్తులు చేసిన తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ సహచర ఆటగాళ్లతో కలిసి పసందైన విందు ఆరగించాడు. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, మనీశ్ పాండేలతో లంచ్ చేస్తుండగా.. తీసిన సెల్ఫీ ఫొటోను కోహ్లీ అభిమానులతో పంచుకున్నాడు. 'టాప్ టీమ్ జిమ్ సెషన్ తర్వాత అందమైన ఆక్లాండ్లో మంచి భోజనం చేసాం' అని కోహ్లీ రాసుకొచ్చాడు.
అంతకుముందు కూడా విరాట్ కోహ్లీ మరో ట్వీట్ చేసాడు. ఆక్లాండ్ చేరుకున్నామంటూ కోహ్లీ సహచర ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకుర్లతో కలిసి దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసాడు. 'ఆక్లాండ్ చేరుకున్నాం. లెట్స్ గో శార్దూల్, శ్రేయస్' అని ట్వీట్ చేశాడు. గత ఏడాది న్యూజిలాండ్లో పర్యటించిన టీమిండియా వన్డే సిరీస్ను 4-1తో గెలుచుకొని.. టీ20 సిరీస్ను 1-2తో కోల్పోయిన విషయం తెలిసిందే.
స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసీస్తో జరిగిన మూడో వన్డేలో గాయపడడంతో అతడు కివీస్ పర్యటనకు దూరమయ్యాడు. దీంతో తొలి మ్యాచ్కు ముందే భారత్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీ20 ఫార్మాట్లో గబ్బర్ స్థానంలో కేరళ యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ను జట్టులోకి తీసుకున్నారు. వన్డేలకు యువ సంచలనం, ముంబై ఆటగాడు పృథ్వీ షా ఎంపికయ్యాడు. బీసీసీఐ సెలెక్టర్లు పృథ్వీ షాకు వన్డేల్లో తొలిసారిగా అవకాశమిచ్చారు. భారత్ తరఫున 2 టెస్టులు ఆడిన అనంతరం గాయాలు, డోపింగ్ నిషేధంతో పృథ్వీ క్రికెట్ ఆటకు దూరమయ్యాడు. అయితే ఇటీవలే పునరాగమనం చేసిన అతనికి వన్డేల్లో అవకాశం దక్కడం విశేషం.