కోహ్లీ అందుకే మూల్యం చెల్లించుకున్నాడు:
జంపా బౌలింగ్కు రాగానే దూకుడుగా ఆడదామని ప్రయత్నించిన విరాట్ కోహ్లీ తొలి బంతిని సిక్స్గా బాదాడు. తర్వాతి బంతికి స్ట్రైట్డ్రైవ్లో భారీ షాట్ ఆడబోయి బౌలర్ (జంపా) చేతికే చిక్కి పెవిలియన్ చేరాడు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో జంపా బౌలింగ్లో కోహ్లీ ఆరుసార్లు ఔటయ్యాడు. కోహ్లీ ఔట్ కాగానే వ్యాఖ్యాతగా ఉన్న స్టీవ్ వా మాట్లాడుతూ.. జంపా బౌలింగ్ను కోహ్లీ తేలికగా తీసుకుంటున్నాడు, అందుకే మూల్యం చెల్లించుకున్నాడని పేర్కొన్నాడు.
జంపా నాణ్యమైన బౌలర్:
అయితే తొలి వన్డేకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో జంపా బౌలింగ్ను కోహ్లీ కొనియాడిన విషయం తెలిసిందే. '2019 ఆసీస్ పర్యటనలో జంపా ఒక్కడే ఎక్కువ ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. ఆ సిరీస్ మొత్తం అతడి బౌలింగ్లో మా బ్యాట్స్మన్ బౌండరీలు కొట్టినా.. వికెట్లు తీయాలని చూసేవాడు. మణికట్టు బౌలర్లకు అదే ముఖ్యం అని నేను భావిస్తా. ఆ పర్యటనలో అతడి ఆలోచనా దృక్పథం ఎంతో అద్భుతం. జంపా నాణ్యమైన బౌలర్. ఇప్పటికీ అతనికి వికెట్లు పడగొట్టే సత్తా ఉంది. జంపా బౌలింగ్లో జాగ్రత్తగా ఆడాలి' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
అత్యధిక సార్లు కోహ్లీనే:
పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆడమ్ జంపా అత్యధిక సార్లు విరాట్ కోహ్లీనే ఔట్ చేసాడు. 19 మ్యాచ్ల్లో కోహ్లీని ఆరు సార్లు పెవిలియన్ చేర్చాడు. 18 మ్యాచ్ల్లో మూడు సార్లు రోహిత్ శర్మను, 13 మ్యాచ్ల్లో మూడు సార్లు ఎంఎస్ ధోనీని, 12 మ్యాచ్ల్లో మూడు సార్లు కేదార్ జాదవ్ను, 4 మ్యాచ్ల్లో మూడు సార్లు దసున్ షనకకు ఔట్ చేసాడు. జంపా ఇప్పటివరకు 49 వన్డేలు ఆడి 66 వికెట్లు తీసాడు. అత్యుత్తమ ప్రదర్శన 4/43.
రాజ్కోట్లో రెండో మ్యాచ్:
తొలి వన్డేలో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌటైంది. శిఖర్ ధావన్ (91 బంతుల్లో 74; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా.. కేఎల్ రాహుల్ (61 బంతుల్లో 47; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. మిచెల్ స్టార్క్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఆ్రస్టేలియా 37.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 258 పరుగులు చేసి గెలిచింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' డేవిడ్ వార్నర్, కెప్టెన్ ఆరోన్ ఫించ్ అద్భుత సెంచరీలతో జట్టును గెలిపించారు. సిరీస్లో ఆసీస్ 1-0తో ముందంజ వేసింది. రెండో మ్యాచ్ ఈరోజు రాజ్కోట్లో జరగనుంది.