
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో మంగళవారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 1 పరుగు తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఢిల్లీ విజయానికి చివరి బంతికి 6 పరుగుల అవసరమవగా.. రిషబ్ పంత్ బౌండరీ మాత్రమే బాదడంతో ఒక్క పరుగు తేడాతో బెంగళూరు విజయం సాధించింది. దీంతో పంత్ బాధపడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. అతని బాధ చూసిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, పేసర్ మొహ్మద్ సిరాజ్ ఓదార్చారు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ హిట్టర్ షిమ్రాన్ హిట్మెయర్ (25 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు).. కైల్ జేమిన్సన్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టి 21 పరుగులు రాబట్టాడు. దీంతో ఢిల్లీ విజయ సమీకరణం చివరి 12 బంతుల్లో 25 పరుగులుగా మారింది. హర్షల్ పటేల్ వేసిన 19వ ఓవర్లో హిట్మెయర్, రిషబ్ పంత్ (58 నాటౌట్; 6 ఫోర్లు) కలిసి 11 పరుగులు చేయడంతో.. చివరి ఓవర్లో ఢిల్లీకి 14 రన్స్ అవసరం అయ్యాయి.
చివరి ఓవర్లో రిషబ్ పంత్, సిమ్రాన్ హిట్మెయర్ క్రీజులో ఉండటంతో బెంగళూరు విజయం ఖాయం అని అందరూ అనుకున్నారు. అయితే చివరి ఓవర్ బౌలింగ్ చేసిన మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బంతులు వేశాడు. మొదటి బంతి నుంచే యార్కర్లు విసురుతూ వచ్చిన సిరాజ్.. తొలి నాలుగు బంతుల్లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక చివరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరం అయ్యాయి. సిరాజ్ ఐదో బంతి ఫుల్ టాస్ వేయగా.. బ్యాక్ వర్డ్ పాయింట్ దిశగా పంత్ బౌండరీకి తరలించాడు.
ఇక ఢిల్లీ విజయానికి చివరి బంతికి ఆరు పరుగులు కావాలి. ఆఖరి బంతిని వైడ్ యార్కర్ రూపంలో సిరాజ్ సంధించగా.. పాయింట్లో రిషబ్ పంత్ ఫోర్ బాదాడు. దాంతో ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ మ్యాచ్ ఓడిపోయింది. దీంతో పంత్ చాలా ఎమోషనల్ అయిపోయాడు. నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న హిట్మెయర్ కూడా నిరాశతో మైదానంలో అలా కూర్చుండిపోయాడు. ఇది చూసిన బెంగళూరు ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, యుజ్వేంద్ర చహల్, మొహ్మద్ సిరాజ్ ఓదార్చారు. ముఖ్యంగా పంత్ను కోహ్లీ హత్తుకుని సర్దిచెప్పాడు. వీరితో పాటు మిగతా వాళ్లు కూడా వారికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.