8 వేల క్లబ్కు చేరువలో కోహ్లీ
టెస్టు క్రికెట్లో 8 వేల పరుగులు మైలు రాయిని చేరుకోవడానికి విరాట్ కోహ్లీకి మరో 53 పరుగులు మాత్రమే కావాలి. సౌతాఫ్రికాతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీ 17 పరుగులతో క్రీజులో ఉన్నాడు. దీంతో మూడో రోజైనా గురువారం విరాట్ మరో 53 పరుగులు సాధిస్తే టెస్టు క్రికెట్లో 8 వేల పరుగులు పూర్తి చేసిన ఆరో భారత బ్యాటర్గా కోహ్లీ నిలుస్తాడు. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 33వ బ్యాటర్ అవుతాడు.
ఇప్పటివరకు తన కెరీర్లో 99 టెస్టు మ్యాచ్లు ఆడిన విరాట్ 168 ఇన్నింగ్స్ల్లో 50 సగటుతో 7,947 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రికార్డు స్థాయిలో 7 సార్లు డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. అత్యధిక స్కోర్ 254 పరుగులు. ఈ క్రమంలో 894 ఫోర్లు, 24 సిక్స్లు బాదాడు.
కోహ్లీ కంటే ముందు
విరాట్ కోహ్లీ కంటే టెస్టు క్రికెట్లో 8 వేల పరుగులు పూర్తి చేసిన భారత బ్యాటర్ల జాబితాలో ఐదుగురు ఉన్నారు. మొదటి సారి సునీల్ గవాస్కర్ ఈ మార్క్ను చేరుకున్నాడు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీ ఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ 8 వేల పరుగుల మైలురాయిని అధిగమించారు. మొత్తంగా 15 వేలకుపైగా పరుగులు చేసి ఈ జాబితాలో మాష్టర్ బ్లాష్టర్ సచిన్ టెండూల్కర్ ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా కూడా సచిన్వే అత్యధిక పరుగులు.
వేగంగా నాలుగో స్థానంలో..
8 వేల పరుగులను వేగంగా అందుకున్న భారత బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో నిలుస్తాడు. ఆ జాబితాలో కేవలం 154 ఇన్నింగ్స్ల్లోనే 8 వేల పరుగులు పూర్తి చేసి సచిన్ టెండూల్కర్ తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్ (158 ఇన్నింగ్స్లు), వీరేంద్ర సెహ్వాగ్ (160 ఇన్నింగ్స్లు) ఉన్నారు. కాగా ఇప్పటివరకు కోహ్లీ 168 ఇన్నింగ్స్లు ఆడాడు. దీంతో నేటి మ్యాచ్లో కోహ్లీ 8 వేల మార్క్ను అందుకుంటే నాలుగో స్థానంలో నిలుస్తాడు.