కోహ్లీ భావోద్వేగం: అప్పట్లో ఈ స్టేడియంలో శ్రీనాథ్ ఆటోగ్రాఫ్ అడిగా.. ఇప్పుడు నా పేరుతో పెవిలియన్

న్యూఢిల్లీ: 19 ఏళ్ల క్రితం మ్యాచ్ చూసేందుకు ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి వచ్చా. గ్యాలరీ నుంచి పేసర్ జవగల్ శ్రీనాథ్ ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు ఎంతో ప్రయత్నించా అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపారు. దేశ రాజధానిలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి దివంగత బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పేరు పెట్టారు. ఢిల్లీ ప్రాంతంలో క్రికెట్కు ప్రాచుర్యం తీసుకురావడం కోసం జైట్లీ చేసిన సేవలను గౌరవిస్తూ ఈ స్టేడియం పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. 1999 నుంచి 2012 వరకు 13 ఏళ్ల పాటు డీడీసీఏ అధ్యక్షుడిగా జైట్లీ కొనసాగారు. 66 ఏళ్ల అరుణ్ జైట్లీ దీర్ఘకాలిక అస్వస్థత కారణంగా గత నెల 24న కన్నుమూసిన సంగతి తెలిసిందే.

ముఖ్య అతిథిలుగా అమిత్ షా, కపిల్దేవ్:
అలాగే ఒక స్టాండ్కు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పెవిలియన్ అని పేరు పెట్టారు. ఈ రెండు కార్యక్రమాలు గురువారం నెహ్రూ స్టేడియంలోని వెయిట్లిఫ్టింగ్ హాల్లో జరిగాయి. దీనికి భారత హోంశాఖ మంత్రి అమిత్ షా, క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్క శర్మ, కోచ్ రవి శాస్త్రి సహా పలువురు ఆటగాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కోహ్లీ భావోద్వేగం:
డీడీసీఏకు జైట్లీ అందించిన సేవల్ని అమిత్ షా, కపిల్ దేవ్ ఈ సందర్భంగా కొనియాడారు. ఆపై విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రయాణానికి సంబంధించిన ఓ వీడియోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ... 'ఇలాంటి అరుదైన గౌరవం నాకు లభిస్తుందని నేను ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదు. నా భార్య, కుటుంబ సభ్యుల ముందు ఈ ఆనందాన్ని ఎలా వర్ణించాలో అర్ధం కావడం లేదు' అని భావోద్వేగం చెందారు.

మ్యాచ్ చూడటానికి పరుగెత్తా:
'2000 సంవత్సరంలో జింబాబ్వేతో మ్యాచ్ జరిగింది. నా చిన్నప్పటి కోచ్ రాజ్కుమార్ శర్మ రెండు టికెట్లు ఇచ్చారు. వెంటనే నా సోదరుడితో కలిసి మ్యాచ్ చూడటానికి పరుగెత్తా. గ్యాలరీ నుంచి పేసర్ జవగల్ శ్రీనాథ్ ఆటోగ్రాఫ్ అడిగా. ఇప్పుడు ఇదే స్టేడియంలో నా పేరుతో పెవిలియన్ ఉండటం గౌరవంగా ఉంది' అని 19 ఏళ్ల క్రితం జ్ఞాపకాల్ని కోహ్లీ గుర్తుచేశారు. మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కష్టకాలంలో తనకు అండగా నిలిచారని పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications