బర్మింగ్హామ్: 2014వ సంవత్సరం ధోనీ కెప్టెన్సీలో ఉండగా టీమిండియా ఇంగ్లాండ్ పర్యటన చేసింది. అయితే అప్పటి పర్యటనలో ఐదు టెస్టుల్లో పది ఇన్నింగ్స్ కలిపి కోహ్లీ ఆడింది 134 పరుగులు మాత్రమే. అలాంటిది ప్రస్తుత ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీ మొదటి టెస్టులో తొలి ఇన్నింగ్స్లోనే 149 పరుగులు చేశాడు. గత పర్యటనలో అండర్సన్ ఉచ్చులో పడిన కోహ్లీ ఇప్పుడు అతడ్ని ఎదుర్కోవడానికి తన స్టాన్స్నే మార్చుకున్నాడు.
అండర్సన్ బౌలింగ్ ఎదుర్కోవాలనే ఆలోచనలో ఉన్న కోహ్లీ.. క్రీజులో నిలుచునే చోటుకు కొంచెం ముందుకు వచ్చి నిలబడ్డాడు. అతను వేసే బంతులు స్వింగ్ అయ్యాక ఆడటం ఇబ్బందిగా ఉంటుందని తలచి.. వాటిని కొంచెం ముందుగానే అందుకోవాలని ముందుకు వచ్చి ఆడాడట. ఇలా క్రీజులో కొంచెం ముందుకు వచ్చి ఆడాలన్న సలహా కోహ్లీకి ఎవరు ఇచ్చి ఉండొచ్చనే సందేహం అందరికీ ఉంటుంది.
క్రికెట్ దిగ్గజం.. గాడ్ ఆఫ్ క్రికెట్.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇచ్చిన సలహా మేరకే కోహ్లీ అలా ఆడాడట. అండర్సన్ బౌలింగ్ వేసే సమయంలో క్రీజులో సాధారణంగా నిలుచునే దాని కంటే 40 సెంటీమీటర్లు ముందుకు రావాలని సచిన్.. కోహ్లీకి సలహా ఇచ్చాడట. ఆఫ్సైడ్ వేసే బంతులు ఊరించినా ఎక్కువగా వాటి జోలికి వెళ్లొద్దన్నాడట. సహనం, ఓర్పుతో అతడి బంతులను ఎదుర్కోమని చెప్పాడట. సరిగ్గా సచిన్ చెప్పిన ప్లాన్ను కోహ్లీ తొలి టెస్టులో అమలు చేశాడు.
ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో 149 పరుగులు సాధించగలిగాడు. ఆఫ్సైడ్ ఆవల ఊరించే బంతులను అండర్సన్ వేసిన అతడి ఉచ్చులో పడేందుకు కోహ్లీ వాటిని ఆడకుండా వదిలేశాడు. చాలా వరకు షాట్లు ఆడకుండా నియంత్రించుకున్నాడు. అండర్సన్ బౌలింగ్లో కోహ్లీ 74 బంతులాడితే 18 పరుగులు మాత్రమే చేశాడు. మైదానంలో ఎంతో దూకుడుగా కనిపించే కోహ్లీ ఇలా ఒక బౌలర్ విషయంలో కోహ్లీ ఇంతగా నియంత్రణ పాటించడం ఇప్పటిప వరకూ చూడని ప్రదర్శన. కాగా, నాలుగో రోజు ఆటలో కోహ్లీ 51 పరుగులు మాత్రమే చేయగా.. ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.