హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఫిరోజ్ షా కోట్లా వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. చివరి రోజు టీమిండియా విజయానికి 7 వికెట్లు అవసరం కాగా 87 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీయగలిగారు.
దీంతో మూడు టెస్టుల సిరిస్ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది. కెప్టెన్గా కోహ్లీకి ఇది వరుసగా తొమ్మిదో సిరీస్ విజయం కావడం విశేషం. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా అత్యధిక టెస్టు సిరిస్ విజయాలు సాధించిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డుని కోహ్లీ సమం చేశాడు.
2005 నుంచి 2008 మధ్య కాలంలో పాంటింగ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు వరుసగా తొమ్మిది సిరీస్లను గెలిచింది. ఇంగ్లండ్ జట్టు కూడా 1884 నుంచి 1892 మధ్యకాలంలో తొమ్మిది టెస్టు సిరీస్లలో విజయాలు సాధించింది. 2015లో ధోని నుంచి టెస్టు కెప్టెన్సీ పగ్గాలను అందుకున్న కోహ్లీ తొలి టెస్టు సిరిస్ను లంకపైనే గెలవడం విశేషం.
ఆ తర్వాత దక్షిణాఫ్రికా (సొంతగడ్డపై), 2016లో వెస్టిండిస్ (బయట), 2017లో న్యూజిలాండ్ (సొంతగడ్డపై), ఇంగ్లాండ్ (సొంతగడ్డపై), ఆస్ట్రేలియా (సొంతగడ్డపై), బంగ్లాదేశ్ (సొంతగడ్డపై), శ్రీలంక (బయట) కోహ్లీ వరుస సిరిస్లను గెలిచాడు. స్వదేశంలో శ్రీలంకతో సిరిస్ అనంతరం కోహ్లీసేన దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తోంది.
ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో కోహ్లీసేన మూడు టెస్టులు ఆడనుంది. ఈ మూడు టెస్టుల సిరిస్లో గనుక టీమిండియా విజయం సాధిస్తే కోహ్లీ కెప్టెన్గా ప్రపంచ రికార్డుని నెలకొల్పుతాడు. ఈ సిరిస్లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు జనవరి 5న ప్రారంభం కానుంది.
టెస్టుల్లో భారత్కు అత్యధిక విజయాలను అందించిన కెప్టెన్ల జాబితాలో విరాట్ కోహ్లీ 3వ స్ధానంలో ఉన్నాడు. కోహ్లీ కెప్టెన్సీలో భారత్ 32 మ్యాచ్లాడగా 20 మ్యాచ్ల్లో విజయం సాధించింది. కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని భారత్కు అత్యధిక విజయాలను అందించాడు. ధోని కెప్టెన్సీలో భారత్ 60 టెస్టులాడగా 27 టెస్టుల్లో విజయం సాధించింది.
ఇక ధోని తర్వాత సౌరవ్ గంగూలీ 49 టెస్టుల్లో 20 విజయాలతో రెండో స్ధానంలో ఉన్నాడు. 2017 భారత్ క్రికెట్కు అద్భుతమైన ఏడాది. ఈ ఏడాది టీమిండియా మూడు ఫార్మాట్లలో కూడా అద్భుత ప్రదర్శన చేసింది. ఈ ఏడాది రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వరద పారించాడు.
మొత్తం 46 మ్యాచ్లు ఆడిన కోహ్లీ ఇప్పటివరకు 2818 పరుగులు చేశాడు. 68.73 యావరేజితో పరుగులు చేసిన కోహ్లీ 11 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు సాధించాడు. వరుసగా రెండో ఏడాది కూడా మూడు డబుల్ సెంచరీలను నమోదు చేశాడు. శ్రీలంకతో ముగిసిన మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో కోహ్లీ ఓ సెంచరీతోపాటు రెండు డబుల్ సెంచరీలు నమోదు చేశాడు.
చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్లో 50 పరుగులు చేసిన కోహ్లీ లంకపై మూడు టెస్టుల్లోనే 610 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సిరీస్ల్లో కూడా కోహ్లీ 600కి పైగా పరుగులు చేశాడు. 2014-15లో ఆసీస్పై 692 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ 2016-17లో ఇంగ్లాండ్పై 655 పరుగులు చేశాడు. తద్వారా మూడు సిరీస్ల్లో 600కిపైగా పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.