అతడు ఫిట్నెస్ టెస్టు తరహాలో పరుగెత్తించాడు.. ఆ మ్యాచ్ని ఎప్పటికీ మరిచిపోలేను: కోహ్లీ

లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో చిరుతలా మ్యాచ్ మొత్తం పరుగెత్తగల సామర్థ్యం అతని సొంతం. జట్టు సభ్యులంతా రెండు గంటలు కసరత్తులు చేస్తే.. కోహ్లీ నాలుగు గంటలు కష్టపడతాడు. ఎక్కువ సేపు జిమ్లో గడుపుతూ భారత ఆటగాళ్లందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అలాంటి కోహ్లీ కూడా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ముందు తలవంచాడు. ఓ సందర్భంలో ధోనీతో పాటు వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తలేక అలసిపోయాడు. చివరకు మైదానంలోనే మోకాళ్లపై కూర్చుండిపోయాడు.

కోహ్లీ 82 నాటౌట్
2016 టీ20 వరల్డ్కప్లో భాగంగా మొహాలి వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో మొదటగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఓపెనర్ అరోన్ ఫించ్ (43: 34 బంతుల్లో 3x4, 2x6), గ్లెన్ మాక్స్వెల్ (31: 28 బంతుల్లో 1x4, 1x6) రాణించారు. అనంతరం ఛేదనలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (12), శిఖర్ ధావన్ (13) నిరాశపరిచినా.. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ (82 నాటౌట్: 51 బంతుల్లో 9x4, 2x6) జట్టును ఆడుతున్నాడు. చివర్లో ఎంఎస్ ధోనీ (18 నాటౌట్: 10 బంతుల్లో 3x4)తో కలిసి 19.1 ఓవర్లలో టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు.

పరుగెత్తలేక అలసిపోయాడు
ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ-ఎంఎస్ ధోనీ ఐదో వికెట్కి అజేయంగా 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరూ ఓ అథ్లెట్ తరహాలో పరుగెత్తారు. మరీ ముఖ్యంగా ధోనీ సింగిల్ వచ్చే చోట డబుల్ కోసం కోహ్లీని తరచూ పిలిచాడు. దాంతో ఆస్ట్రేలియా ఫీల్డర్లపైనా ఒత్తిడి కనిపించింది. ధోనీ వేగంగా సింగిల్ పూర్తి చేసుకుని డబుల్కి పిలవడంతో.. కోహ్లీ కూడా మరింత వేగంగా వికెట్ల మధ్య పరుగెత్తాల్సి వచ్చింది. ఎంతో ఫిట్నెస్ ఉన్న కోహ్లీ కూడా మహీ ముందు సరితూగలేకపోయాడు. ఓ సందర్భంలో ధోనీతో పాటు వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తలేక అలసిపోయాడు. చివరకు మైదానంలోనే మోకాళ్లపై కూర్చుండిపోయాడు.

ఎప్పటికీ మరిచిపోలేను
గత ఏడాది కూడా ఆ మ్యాచ్ని, ఈమె ధోనీతో పరుగుని విరాట్ కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. తాజాగా మరోసారి ఆ జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. 'ఆ మ్యాచ్ని ఎప్పటికీ మరిచిపోలేను. ఫిట్నెస్ టెస్టులో పరుగెత్తినట్లు నన్ను ధోనీ భాయ్ పరుగులు పెట్టించాడు' అని కోహ్లీ తెలిపాడు. సాధారణంగా వికెట్ల మధ్య కోహ్లీ గంటకి సగటున 25కిమీ వేగంతో పరుగెత్తతాడు. కానీ ధోనీ నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్నప్పుడు ఆ వేగం మరింత పెంచాల్సి వచ్చింది. ఆ మ్యాచ్లో టీమిండియా ఆఖరికి 6 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. కోహ్లీకి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications