
బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు వెనుకంజలో ఉన్న సమయంలో రిషభ్ పంత్, విరాట్ కోహ్లీ కలిసి అందుకున్న క్యాచ్ నెట్టింట వైరల్గా మారింది. అప్పటి వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోని బంగ్లా అప్పుడే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో నాలుగో రోజు భారత జట్టు పైచేయి సాధించింది.
ఓవర్నైట్ స్కోరు 42/0తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్.. నాలుగో రోజు కూడా తన ఆధిపత్యం కొనసాగించింది. ఒక్క వికెట్ కూడా పడకుండానే బంగ్లా ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. దీంతో త్వరత్వరగా బంగ్లాను ఆలౌట్ చేయాలని అనుకున్న భారత వ్యూహం దెబ్బతిన్నట్లు అంతా అనుకున్నారు. అలాంటి సమయంలో ఉమేష్ యాదవ్ జట్టును ఆదుకున్నారు. ఆఫ్ స్టంప్ ఆవలగా అతను వేసిన బంతిని షాంటో ఆఫ్సైడ్ ఆడబోయాడు. ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతి వెనక్కు వెళ్లింది. స్లిప్స్లో ఉన్న కోహ్లీ ఈ బంతి గాల్లో ఉండగానే అందుకోవడానికి పక్కకు దూకాడు.
కానీ టైమింగ్ సరిగా కుదరకపోవడంతో అతని చేతికి తగిలిన బంతి పక్కకు జారిపోయింది. అయితే కోహ్లీ ఈ క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నించడాన్ని పక్కనే ఉన్న రిషభ్ పంత్ జాగ్రత్తగా చూస్తున్నాడు. దీంతో కోహ్లీ చేతి నుంచి బంతి జారగానే తాను రియాక్ట్ అయ్యాడు. చటుక్కున ముందుకు దూకి బంతి నేలను తాకకముందే చెయ్యి అడ్డుపెట్టాడు. ఆ వెంటనే రెండో చేత్తో క్యాచ్ సేవ్ చేశాడు. దీంతో 67 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షాంటో పెవిలియన్ చేరాడు. బంగ్లాదేశ్ జట్టు 124 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత స్పిన్నర్లు రాణించడంతో బంగ్లాదేశ్ 238 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.