హైదరాబాద్: మ్యాచ్లో ప్రదర్శనను బట్టే క్రేజ్ పెరగడమైనా, రేంజ్ మారడమైనా జరిగేది. ఇలానే జరిగింది విజయ్ శంకర్, దినేశ్ కార్తీక్ విషయంలో.. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన నిదహాస్ ముక్కోణపు సిరీస్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో బంగ్లా జట్టు ఇచ్చిన లక్ష్యాన్ని చేధించాలంటే ఆఖరి రెండు ఓవర్లకు 34పరుగులు చేయాల్సి ఉంది.
అదే సమయంలో క్రీజులో ఉన్న విజయ్ శంకర్ బాల్లను తినేశాడంటూ పలు విమర్శలు వచ్చాయి. అంతేగాక ఒక ఫోర్ బౌండరీ కొడదామని ప్రయత్నించి విఫలమైయ్యాడు. అతని తర్వాత వచ్చిన దినేశ్ కార్తీక్ ఒకే ఓవర్లో 29పరుగులు రాబట్టడమే కాక, ఆఖరి బంతికి ఐదు పరుగుల లక్ష్యాన్ని సిక్సుతో సాధించాడు.
దీంతో విజయ్ శంకర్ బతికిపోయాడు. కానీ, అతనికి ఒప్పుడు ఓదార్పు ఎక్కువైపోయింది. చివరి ఓవర్లో ఔటయిన శంకర్. కేవలం 19 బంతుల్లో 17 పరుగులే చేశాడు. దీంతో సోషల్ మీడియాలో విజయ్ శంకర్ను అభిమానులు వ్యంగ్యంగా ఓదారుస్తున్నారు. దీనిపై తల్లిదండ్రులు, బంధువుల నుంచి అతనికి తెగ సానుభూతి వస్తుంది. అభిమానుల విమర్శల కన్నా.. ఇప్పుడీ సానుభూతి మాటలు విజయ్ను బాగా ఇబ్బంది పెడుతున్నాయి.
దీంతో విసుగుచెందిన శంకర్.. ఇలా అన్నాడు. 'నేను ఆ మ్యాచ్ను మరచిపోదామని చూస్తున్నా.. ఈ సానుభూతి నన్ను ఆ పని చేయనివ్వడం లేదు. మీరు చూపించే జాలి తట్టుకోలేకపోతున్నాను. అయినా భారత్ లాంటి పెద్ద జట్టుకు ఆడే సమయంలో ఇలాంటి తిట్లు భరించాల్సిందే. అదే నేను ఆ మ్యాచ్ గెలిపించి ఉంటే ఆకాశానికెత్తేవారు. కనీసం డకౌటై వెనుదిరిగినా ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదు. కానీ చివరి వరకు వచ్చి ఔటైపోవడంతో విమర్శిస్తున్నారు' అని విజయ్ శంకర్ అన్నాడు.
ఇంకా మాట్లాడుతూ.. ఇలాంటి సవాళ్లను స్వీకరించినప్పుడే మనం ప్లేయర్గా ఎదుగుతామని చెప్పాడు. తాను హీరో కావడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడంతో విచారం వ్యక్తం చేశాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత అందరూ సెలబ్రేట్ చేసుకుంటుంటే.. తాను మాత్రం చాలా ఫీలయ్యానని పేర్కొన్నాడు. కెప్టెన్, కోచ్ కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని సర్దిచెప్పారంటూ విజయ్ శంకర్ తెలిపాడు.