మూడో ఓవర్ తొలి బంతికే తొలి వికెట్
మూడో ఓవర్ తొలి బంతిని బయటకు వచ్చే ఆడే ప్రయత్నంలో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (2)ను, ఫకార్ జమాన్ (0)ను భువనేశ్వర్ తన వరుస ఓవర్లలో పెవిలియన్కు చేర్చాడు. ఇమామ్ (2) పరుగుల వద్ద ధోనికి క్యాచ్ ఇవ్వగా... ఈ షాక్ నుంచి తేరుకునేలోపే ఐదో ఓవర్లో ఫుల్ షాట్ను ఆడే క్రమంలో ఫకార్ జమాన్ (0) చాహల్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. దీంతో జట్టు స్కోరు మూడు పరుగులే కావడంతో పాక్ ఇబ్బందుల్లో పడింది. ఈ కష్ట సమయంలో పాక్ ఇన్నింగ్స్ను బాబర్ ఆజాం, షోయబ్ మాలిక్ గట్టెక్కించారు.
10 ఓవర్లకు 25 పరుగులే చేసిన పాకిస్థాన్
ఏడో ఓవర్లో బాబర్ వరుసగా రెండు ఫోర్లు బాదినా ఆ తర్వాత పరుగులు రాబట్టడం కష్టంగా మారింది. దీంతో తొలి పవర్ప్లేలో అంటే 10 ఓవర్లు ముగిసే సమయానికి పాక్ 25 పరుగులే చేయగలిగింది. ఈ పది ఓవర్లలో భారత్ ఒక్క ఎక్స్ట్రా కూడా ఇవ్వకపోవడం విశేషం. ఆ తర్వాత వీరిద్దరి జోడీ నెమ్మదిగా ఆడుతూ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. 13వ ఓవర్లో షోయబ్ భారీ సిక్సర్ సాధించగా 16వ ఓవర్లో అతడిచ్చిన క్యాచ్ను కీపర్ ధోనీ వదిలేశాడు. తనకు వచ్చిన లైఫ్తో షోయబ్ మాలిక్ చక్కగా వినియోగించుకున్నాడు.
ప్రారంభమైన కేదార్ జాదవ్ హవా
వీరిద్దరి జోడీ అప్పుడప్పుడు బౌండరీలతో పాటు ఎక్కువగా సింగిల్స్పై దృష్టి పెడుతూ చకచకా స్కోరు వేగాన్ని పెంచారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ వైపు సాగుతున్న బాబర్ ఆజాంను 22వ ఓవర్లో కుల్దీప్ అద్భుత బంతితో బౌల్డ్ చేశాడు. 17.1 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన ఈ జోడీ మూడో వికెట్కు 82 పరుగులు జోడించారు. ఆ తర్వాత 24వ ఓవర్లో షోయబ్ మరోసారి ఇచ్చిన సులువైన క్యాచ్ను ఈసారి భువనేశ్వర్ వదిలేశాడు. అయితే ఆ తర్వాత కేదార్ జాదవ్ హవా ప్రారంభమైంది. వరుసగా అతడి మూడు ఓవర్లలో పాక్ మూడు వికెట్లు కోల్పోయింది.
కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకున్న పాండే
ముందుగా 25వ ఓవర్లో సర్ఫరాజ్ (6)ను ఔట్ చేశాడు. సర్ఫరాజ్ ఇచ్చిన క్యాచ్ను బౌండరీ లైన్ దగ్గర సబ్స్టిట్యూట్ మనీష్ పాండే కళ్లు చెదిరే రీతిలో పట్టేశాడు. అయితే రన్నింగ్లో కాస్త అదుపు తప్పడంతో బంతిని గాల్లోకి ఎగిరేసి.. రోప్ను దాటి.. మళ్లీ వచ్చి క్యాచ్ను అందుకున్నాడు. ఓవైపు సహచరులు వెనుదిరిగినా.. ఒంటరి పోరాటం మొదలుపెట్టిన షోయబ్ను అద్భుతమైన డైరెక్ట్ త్రోతో రనౌట్ చేసిన రాయుడు మ్యాచ్ను మలుపు తిప్పేశాడు. 27వ ఓవర్ ఆఖరి బంతిని ఆసిఫ్ అలీ (9) స్కేర్ లెగ్లోకి ఆడాడు.
సూపర్ త్రోతో మాలిక్ను ఔట్ చేసిన రాయుడు
నాన్ స్ట్రయికింగ్లో ఉన్న షోయబ్ మాలిక్ రన్ కోసం వచ్చినా ఆసిఫ్ స్పందించలేదు. అప్పటికే బంతిని అందుకున్న రాయుడు.. షోయబ్ వెనక్కి వచ్చే లోపే నేరుగా వికెట్లను గిరాటేశాడు. కొద్దిసేపటికే వరుస విరామాల్లో జాదవ్.. ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్ (8)లను ఔట్ చేయడంతో 85/2తో ఉన్న పాక్ ఒక్కసారిగా 121/7కు పడిపోయింది. చివర్లో ఎనిమిదో వికెట్కు ఆమీర్ (18 నాటౌట్), ఫహీమ్ (21) 37 పరుగులు జోడించి జట్టు స్కోరును 150 దాటించారు. 36వ ఓవర్ నాలుగో బంతికి ఆష్రాఫ్ ఇచ్చిన క్యాచ్ను చాహల్ వదిలేశాడు.
ఏడో వికెట్కు 37 పరుగుల భాగస్వామ్యం
దీంతో ఏడో వికెట్కు 37 పరుగుల భాగస్వామ్యం నమోదుకావడంతో పాక్ స్కోరు 150 పరుగులు దాటింది. భువీ, జాదవ్ సత్తా చాటడంతో 41 పరుగుల తేడాతో చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. మొత్తంగా 36 పరుగులకే చివరి 5 వికెట్లను పాకిస్థాన్ కోల్పోవడం విశేషం. దీంతో పాకిస్థాన్ 43.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 163 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా 29 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ (52) హాఫ్ సెంచరీతో రాణించారు.