హైదరాబాద్: శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ను పాకిస్థాన్ క్లీన్స్వీప్ చేసింది. పేసర్ ఉస్మాన్ షిన్వారి (5/34)తోపాటు హసన్ అలీ (2/19), షాదాబ్ ఖాన్ (2/24) రాణించడంతో సోమవారం జరిగిన ఆఖరి వన్డేలో పాక్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 26.2 ఓవర్లలో 103 పరుగులు చేసి ఆలౌటైంది. తిసారా పెరీరా (25; 3 ఫోర్లు, ఒక సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 104 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 20.2 ఓవర్లలోనే ఛేదించింది.
పాక్ బ్యాట్స్మెన్లలో ఇమామ్ ఉల్ హక్ (45 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్స్), ఫఖర్ జమాన్ (48; 7 ఫోర్లు) పరుగులతో రాణించారు. ఈ మ్యాచ్లో 21 బంతుల్లోనే 5 వికెట్లు తీసి ఉస్మాన్ ఓ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. గతంలో చమిందా వాస్(16 బంతులు), టిమ్వాన్డర్(20) ఉస్మాన్ కంటే ముందు వరుసలో ఉన్నారు.
ఈ సిరిస్లో అద్భుత ప్రదర్శన చేసిన ఉస్మాన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, హసన్కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దక్కాయి. ఇదిలా ఉంటే ఐదు మ్యాచ్ల సిరీస్ను పాక్ క్లీన్స్వీప్ చేయడం ఇది ఆరోసారి. గతంలో జింబాబ్వే (2002, 2008లో), బంగ్లాదేశ్ (2003, 2008లో), న్యూజిలాండ్ (2003లో) జట్లపై ఈ ఘనత సాధించింది.