
హైదరాబాద్: 2012 అండర్-19 వరల్డ్కప్ నెగ్గిన కెప్టెన్.. ఢిల్లీ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్. ఆ అండర్ 19 టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో చంద్ అద్వితీయమైన సెంచరీతో కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అప్పట్లో చంద్ ఆట తీరు చూసిన వారంతా అంతర్జాతీయ జట్టుకి చాలా తొందరగానే ఎంట్రీ ఇస్తాడని అంచనా వేశారు.
కానీ ఆ తర్వాత దేశవాళీల్లో పేలవ ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీ జట్టులో కూడా చోటు కోల్పోయాడు. అయితే తనపై రాజకీయాలు చేశారంటూ ఉన్ముక్త్ తాజాగా మీడియా ముందు పేర్కొన్నాడు. ఢిల్లీ క్రికెట్ సంఘం చేసిన రాజకీయాలకు తాను బలిపశువునయ్యానని ఉన్ముక్త్ వాపోతున్నాడు.
విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ ప్రభావం ఐపీఎల్ వేలంపై పడింది. ఈ ఏడాది ఐపీఎల్లో చంద్ను ఎవరూ కొనుగోలు చేయలేదు. తన కెరీర్ను కాపాడుకోవడానికి మరో రాష్ట్రానికి ఆడే ఆలోచనలో కూడా ఉన్నానని ఆయన తెలిపాడు.
'నీచ రాజకీయాలకు నేను బలిపశువుగా మారా. రెండేళ్ల క్రితం ముంబైలో టీ20 జోనల్ మ్యాచ్ ఆడుతుండగా వన్డే జట్టు నుంచి నన్ను తప్పించనున్నారని తెలిసింది. దానికి కొన్ని నెలల ముందు భారత్-ఎకు ప్రాతినిథ్యం వహించా.. టాప్ స్కోరర్గా నిలిచా. అంతకు ముందు సీజన్లో కూడా ఢిల్లీ తరఫున అత్యధిక స్కోరు చేసిన బ్యాట్స్మన్గా నిలిచినా.. నాపై వేటు పడడంతో షాక్కు గురయ్యాన'ని చంద్ అన్నాడు.