హైదరాబాద్: డోపింగ్ పరీక్షలో విఫలం కావడంతో టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షాపై బీసీసీఐ 8 నెలలు పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ముస్తాక్ అలీ టీ20 టోర్నీ సందర్భంగా నిర్వహించిన డోప్ పరీక్షల్లో పృథ్వీ షా విఫలమయ్యాడు. అతడి మూత్ర నమూనాల్లో టెర్బుటలైన్ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు తేలింది.
దీంతో డోపింగ్ నిబంధనల ఉల్లంఘన కమిటీ బీసీసీఐ ఏడీఆర్ ఆర్టికల్ 2.1 ప్రకారం అతడిపై చర్యలు తీసుకుంది. 8 నెలల పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. పృథ్వీ షాపై విధించిన నిషేధం నవంబరు 15తో ముగియనుంది. అయితే, పృథ్వీ షా నిషేధంపై ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
తన ట్విట్టర్లో "పాపం షా.. దురదృష్టవంతుడు" అంటూ జోఫ్రా ఆర్చర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను ఉద్దేశపూర్వకంగా ఏ నిషేధిత ఉత్ప్రేరకాన్ని తీసుకోలేదని, ఈ ఏడాది ఆరంభంలో తాను వేసుకున్న దగ్గు మందులో నిషేధిత ఉత్ప్రేరకం ఉందని పృథ్వీ షా ట్విట్టర్ వేదికగా అభిమానులకు వివరణ ఇచ్చుకున్నాడు.
This Jofra is LEGEND #PrithviShaw pic.twitter.com/4Rn1JT62su
— Sameera (@Sameera1606) 30 July 2019
పృథ్వీ షా తన ట్విట్టర్లో "ఈ ఏడాది నవంబరు, 2019 మధ్య వరకు నేను క్రికెట్ ఆడలేనని ఈ రోజు నాకు తెలిసింది. నేను తెలియకుండా తీసుకున్న దగ్గు మందులో ఉన్న నిషేధిత ఉత్ప్రేరకం ఫలితమిది. ఫిబ్రవరిలో ఇండోర్ వేదికగా ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా తీవ్రమైన దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతూ ఆ మందు వాడాను. ఆస్ట్రేలియా పర్యటనలో అయిన కాలి గాయం నుంచి కోలుకుని, ఆటలోకి తిరిగొస్తున్న సమయంలో ఇది జరిగింది. త్వరగా ఆటలోకి రావాలనే ఆతృతలో నేను వాడే మందు విషయంలో జాగ్రత్త వహించలేదు. అయితే తీర్పును శిరసావహిస్తా. ఆడిన చివరి టోర్నీలో గాయపడ్డాను. దాని నుంచి కోలుకుంటున్న సమయంలోనే ఈ నిషేధ వార్త నన్ను ఎంతో బాధకు గురి చేసింది. ఈ ఉదంతంతో మిగతా క్రీడాకారులు చిన్న చిన్న మందులు వాడేటపుడు కూడా ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేస్తుందని ఆశిస్తున్నా. ఈ సందర్భంగా నాకు మద్దతుగా నిలిచిన బీసీసీఐకి, సన్నిహితులకు ధన్యవాదాలు. క్రికెట్టే నా జీవితం. భారత్కు, ముంబైకి ఆడటం కంటే పెద్ద గౌరవం మరేదీ లేదు. ఈ పరిణామం నుంచి త్వరగా కోలుకుని, మరింత దృఢంగా తయారై వస్తా" అని ట్వీట్ చేశాడు.
— Prithvi Shaw (@PrithviShaw) 30 July 2019
మరోవైపు పృథ్వీ షాతో పాటు అక్షయ్ దివాల్కర్, దివ్య గజ్రాజ్ అనే ఇద్దరు దేశవాళీ క్రికెటర్లూ డోపీలుగా తేలారు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన పృథ్వీ షా ప్రాక్టీస్ మ్యాచ్లో గాయపడటంతో ఆ సిరిస్ మొత్తానికి దూరమయ్యాడు. అయితే, గాయ నుంచి కోలుకుని ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైకి ప్రాతినిధ్యం వహించిన షా... ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరుఫున ఐపీఎల్ ఆడాడు.
కాగా, ఇటీవలే తుంటి గాయానికి గురైన పృథ్వీ షా వెస్టిండీస్-ఎతో భారత్-ఎ వన్డే, టీ20 సిరీస్లకు దూరమయ్యాడు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటూ గాయం నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.