హైదరాబాద్: క్రికెట్ బుకీ సంజీవ్ కుమార్ చావ్లాను భారత్కు అప్పగించేందుకు మార్గం సుగమనం అయింది. అక్టోబర్ 2017న వెస్ట్మినిస్టర్ మ్యాజిస్ట్రేట్స్ కోర్టు ఇచ్చిన తీర్పుని పునఃపరిశీలించిన హైకోర్టు అతడిని భారత్కు అప్పగించాలని తీర్పు వెలువరించింది. ఈ తీర్పు భారత్కు లీగల్గా గొప్ప విజయం కావడం విశేషం.
2000లో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో దక్షిణాప్రికా ఆటగాడు హ్యాన్సీ క్రోన్జేకు సంబంధమున్న భారత బుకీ సంజీవ్ కుమార్ చావ్లా ఆ ఘటన తర్వాత లండన్లో తలదాచుకున్నాడు. దీంతో అతడిని భారత్కు అప్పగించాలని వెస్ట్మినిస్టర్ మ్యాజిస్ట్రేట్స్ కోర్టులో భారత హోం సెక్రటరీ తరుపున పిటిషన్ దాఖలైంది.
ప్రపంచంలోని చాలా దేశాలు మానవహక్కుల విషయంలో చాలా కఠిన నిబంధలను పాటిస్తాయి. తమ వద్దనుంచి నేరగాడిని తీసుకువెళ్ళిన దేశాల్లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుందని భావిస్తే అవి నేరస్థుల అప్పగింతకు అంగీకరించవు. ఈ నిబంధన భారత్కు నేరస్తులను అప్పగించే విషయంలో అడ్డుగా మారింది.
భారత పిటిషన్పై విచారణ జరిపిన వెస్ట్మినిస్టర్ మ్యాజిస్ట్రేట్స్ కోర్టు భారత్లోని జైళ్లలో మానవహక్కుల ఉల్లంఘనలు చోటు చేసుకుంటాయని, దీంతో క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసుతో సంబంధం ఉన్న బుకీని ఇండియాకు అప్పగించేందుకు వ్యతిరేకించింది. అయితే, తాజాగా అక్కడి హైకోర్టు మాత్రం నవంబర్ నెలలో ఢిల్లీలోని తీహార్ జైల్లో అలాంటి మానవహక్కుల ఉల్లంఘన జరగడంలేదని అతడిని భారత్కు అప్పగించాలని వెస్ట్మినిస్టర్ మ్యాజిస్ట్రేట్స్ కోర్టు తీర్పుని సవరించింది.
దీంతో 2000 స్పాట్ ఫిక్సింగ్ కేసుతో సంబంధం ఉన్న భారత క్రికెట్ బుకీ సంజీవ్ చావ్లాను త్వరలోనే అక్కడి అధికారులు భారత్కు అప్పగించనున్నారు. లండన్లో భారత అప్పగింత కేసుల తరుపున వాదిస్తోన్న క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ "హైకోర్టు తీర్పు అనంతరం ఈ కేసు తిరిగి వెస్ట్మినిస్టర్ మ్యాజిస్ట్రేట్స్ కోర్టు డిస్ట్రిక్ జడ్జి వద్దకు పంపబడుతుంది" అని పేర్కొన్నారు.
"జనవరి 7న డిస్ట్రిక్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేసి, హైకోర్టు తీర్పుని హోం సెక్రటరీకి పంపుతారు. హోం సెక్రటరీకి ఈ కేసుకు సంబంధించిన ఉత్తర్వులు అందిన తర్వాత రెండు నెలలలోపే అతడిని అప్పగించే తేదీని ఖరారు చేస్తుంది" అని అన్నారు. నిజానికి భారత్లోని జైళ్లలో మానవహక్కుల ఉల్లంఘనపై ఇప్పటికే కొన్ని విమర్శలు ఉన్నాయి.
ఆ విమర్శలను తమకు అనుకూలంగా మలచుకుని నేరస్తులు తరఫు న్యాయవాదులు విదేశీ కోర్టుల్లో బలంగా వాదిస్తున్నారు. క్రికెట్ బుకీ సంజీవ్ చావ్లా, పురూలియా ఆయుధాల జారవిడత కేసులో నిందితుడు కిమ్ డేవీ, సిక్కు ఉద్యమకారుడు కరమ్జీత్ సింగ్లు ఈ కారణాలు చూపే భారత్కు రాకుండా విదేశాల్లో తప్పించుకుని తిరుగుతున్నారు.