దుబాయ్: ఐసీసీ టీ20 ప్రపంచకప్ వాయిదా పడటంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు మార్గం సుగమమైంది. కరోనా వైరస్ కారణంగా మార్చిలో జరగాల్సిన టోర్నీ నిరవధికంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే. అయితే ఆసియా కప్, ప్రపంచకప్ వాయిదాతో అక్టోబర్లో నిర్వహించేందుకు అవకాశం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి లభించింది. మొదట భారత్లోనే నిర్వహించాలని భావించినా.. పరిస్థితులు మెరుగయ్యేలా కనిపించడం లేదు. దీంతో దుబాయ్కు టోర్నీని తరలిస్తున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ ఓ ప్రకటనలో తెలిపారు.
అయితే ఐపీఎల్ 2020 ఆతిథ్యంపై తమకు బీసీసీఐ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బుధవారం తెలిపింది. ఒకవేళ టోర్నమెంట్ వస్తే.. ఐపీఎల్ 2020ని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. మైఖేల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈసీబీ అధికారి ఒకరు మాట్లాడుతూ... 'ఐపీఎల్ 2020 యూఏఈలో జరగనుందని వార్తలు విన్నాం. అయితే బీసీసీఐ నుండి మాకు ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఐపీఎల్ 2020ని యూఏఈకి మార్చడానికి భారత క్రికెట్ బోర్డు తమ ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయం కోసం మేము వేచిఉంటాం. వచ్చేవారం ఐపీఎల్ పాలక మండలి సమావేశం జరగనుంది. అప్పటివరకు మేము వేచిఉంటాం' అని తెలిపారు.
ఐపీఎల్ లీగ్ను యూఏఈ వేదికగా నిర్వహించనున్నారన్న వార్తలు ఎప్పటినుండో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దుబాయ్ స్పోర్ట్స్ సిటీ చీఫ్ సల్మాన్ హనీఫ్ తాజాగా స్పందించాడు. 'ఒకవేళ ఐపీఎల్ 2020ని దుబాయ్లో నిర్వహించాలనుకుంటే.. మేము సిద్ధంగా ఉన్నాం. దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో అన్ని సదుపాయాలు రెడీగా ఉన్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, ఐసీసీ అకాడమీ.. స్పోర్ట్స్ సిటీలోనే ఉన్నాయి. స్టేడియంలో తొమ్మిది పిచ్లు ఉన్నాయి. ఒకవేళ తక్కువ సమయంలో ఎక్కువ మ్యాచ్లు నిర్వహించినా ఎటువంటి నష్టం ఉండదు' అని అన్నారు. ఐసీసీ కాంప్లెక్స్లో ప్రాక్టీస్ కోసం 38 నెట్ వికెట్లు ఉన్నట్లు హనిఫ్ తెలిపారు.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ను సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 8 వరకు యూఏఈలో నిర్వహిస్తామని బీసీసీఐ ఇప్పటికే ఫ్రాంఛైజీలకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఈ షెడ్యూల్పై ప్రసారదారు స్టార్ ఇండియా అసంతృప్తితో ఉంది. టోర్నీని మరో వారం రోజులు పొడిగించాలని స్టార్స్పోర్ట్స్ డిమాండ్ చేస్తోంది. దీంతో స్టార్ నిర్ణయాలకు అనుగుణంగా షెడ్యూల్తో పాటు మ్యాచ్ సమయాల్లో మార్పులు చేయడానికి బీసీసీఐ సుముఖంగా ఉన్నట్టు సమాచారం. స్టార్ ఇండియా ఒత్తిడి నేపథ్యంలో సెప్టెంబర్ 26 నుంచి కాకుండా.. సెప్టెంబర్ 19 నుండే లీగ్ ప్రారంభించాలని బీసీసీఐ చూస్తోందట
అక్టోబర్-నవంబర్లో దుబాయ్ వేదికగా పొట్టి క్రికెట్ వేడుక నిర్వహిస్తామని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ అన్నారు. 'వారం పది రోజుల్లో ఐపీఎల్ పాలక మండలి సమావేశం అవుతుంది. పూర్తి షెడ్యూలుపై నిర్ణయం తీసుకోనుంది. ఇప్పుడు 60 మ్యాచులతో యూఏఈలో పూర్తి స్థాయిలో ఐపీఎల్ నిర్వహించడంపై దృష్టిసారిస్తాం' అని బ్రిజేష్ పటేల్ అన్నారని తెలిసింది. ఇక విదేశీ ఆటగాళ్లు నేరుగా దుబాయ్కే వస్తారని సమాచారం. 'మన ఆటగాళ్లకు కనీసం మూడు నుంచి నాలుగు వారాల శిక్షణ అవసరం. బీసీసీఐ తేదీలు ప్రకటించగానే మా ప్రణాళికలపై నిర్ణయం తీసుకుంటాం' అని ఆయన పేర్కొన్నారు.
మహిళా సాకర్ జట్టును కొనుగోలు చేసిన సెరెనా విలియమ్స్!!