
కొలంబో: ఉత్కంఠభరిత పోరులో ధ్రువ్ జురెల్ సారథ్యంలోని భారత యువ జట్టు ఆసియా అండర్-19 విజేతగా నిలిచింది. టోర్నీ మొత్తం ఎదురులేని ఆటతో సత్తాచాటిన భారత కుర్రాళ్లు ఫైనల్లోనూ అదిరే ఆటతో ఆతిథ్య బంగ్లాదేశ్ను ఓడించారు. శనివారం జరిగిన ఫైనల్లో భారత్ 5 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ అండర్-19ను ఓడించింది. ఛేదనలో భారత స్పిన్నర్ అథర్వ అన్కోలేకర్ (5/28)తో బంగ్లాను బెంబేలెత్తించాడు.
టాస్ గెలిచి తొలుత బ్యాటిం గ్ చేసిన భారత్ 32.4 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. భారత్ 5.1 ఓవర్లలో కేవలం 8 పరుగులకే టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ను కోల్పోయింది. ఈ సమయంలో కెప్టెన్ ధ్రువ్ జురేల్ (33) శశ్వత్ రావత్ (19)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. కొద్ది సమయంలోనే రావత్, వరుణ్ లావాండే (0), అధర్వ అన్కోలేకర్ (2) కూడా పెవిలియన్ చేరడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కరణ్ లాల్ (37) బ్యాట్ జులిపించాడు. కరణ్ లాల్ నిష్క్రమణ అనంతరం చివరి బ్యాట్స్మన్ కూడా చేతులెత్తయడంతో భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. బంగ్లా బౌలర్లలో షమీమ్ హుస్సేన్, మిథున్జాయ్ చౌధురి మూడేసి వికెట్లు తీశారు.
అనంతరం భారత లెఫ్టార్మ్ స్పిన్నర్, 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అథర్వ అంకోలేకర్ (5/28) ధాటికి బంగ్లాదేశ్ 33 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. ఓ దశలో బంగ్లా 16-4 వికెట్లు కోల్పోయినా.. కెప్టెన్ అక్బర్ అలీ (23), మృత్యుంజయ్ (21) కొంత పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. చివర్లో బంగ్లా విజయానికి 29 పరుగులు చేయాల్సిన దశలో తన్జీమ్ (12), రకీబుల్ (11 నాటౌట్) తొమ్మిదో వికెట్కు 23 పరుగులు జోడించి జట్టును విజయానికి చేరువగా తీసుకొచ్చారు. ఇక గెలుపు కోసం మరో 6 పరుగులు చేయాల్సి ఉండగా.. ఒకే ఓవర్లో అథర్వ రెండు వికెట్లు పడగొట్టడంతో బంగ్లా ఆలౌట్ అయింది. ఆసియా విజేతగా భారత్ నిలిచింది. విద్యాధర్, సుశాంత్ మిశ్రా ఒక్కో వికెట్ తీశారు. ఇరు జట్లలో చెరో ఎనిమిది మంది సింగిల్ డిజిట్లకే పరిమితవడం విశేషం.