ఏడాది నిషేధం
దేశవాళీ అండర్-16, అండర్-19 వయో విభాగాల్లో ఆడిన సమయంలో మన్జోత్ కాల్రా అసలు వయసుకంటే తక్కువ వయసు చూపి జట్లలోకి ఎంపికయ్యాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు తప్పని కాల్రా నిరూపించలేకపోయాడు. దాంతో కాల్రాపై ఏజ్ గ్రూప్ క్రికెట్ ఆడకుండా రెండేళ్లు, రంజీ ట్రోఫీ ఆడకుండా ఏడాది పాటు నిషేధం విధిస్తున్నట్లు డీడీసీఏ అంబుడ్స్మన్ జస్టిస్ (రిటైర్డ్) బదర్ దురెజ్ ప్రకటించారు.
కాల్రా వయస్సు 20 ఏళ్ల 351 రోజులు
భారత క్రికెట్ నియంత్రణ మండలి రికార్డుల ప్రకారం మన్జ్యోత్ కాల్రా ప్రస్తుత వయస్సు 20 ఏళ్ల 351 రోజులు. ఇటీవలే అండర్-23 క్రికెట్ టోర్నీలో బెంగాల్తో మ్యాచ్లో కాల్రా 80 పరుగులు చేశాడు. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ శ్రీలంకతో టీ20 సిరీస్కు ఎంపిక కావడంతో.. అతని స్థానంలో కాల్రా ఢిల్లీ జట్టులోకి రావడం ఖాయమైంది. అయితే వేటు కారణంగా కాల్రా ఎలాంటి క్రికెట్ ఆడే అవకాశం లేకుండా పోయింది.
నితీశ్ రానాకు గడువు
జూనియర్ స్థాయిలో సమర్పించిన వయసు వివరాలు సరైనవేనని నిరూపించుకోవాలంటూ ఢిల్లీ సీనియర్ జట్టు వైస్ కెప్టెన్ నితీశ్ రానాకు గడువు ఇచ్చారు. ప్రస్తుతం రంజీల్లో ఉత్తర్ప్రదేశ్ తరఫున ఆడుతున్న శివమ్ మావి వయసుకు సంబంధించిన అంశంపై విచారణ చేయాల్సిందిగా బీసీసీఐకు సిఫారసు చేశారు. తన పదవీ కాలం చివరి రోజు రాత్రి దురేజ్ అహ్మద్ ఈ ఆదేశాలను జారీ చేయడం ఢిల్లీ క్రికెట్ సంఘం అధికారులను విస్మయానికి గురి చేసింది.